కోనసిమ అంటేనే వేదసీమ అని పెద్దల ఉవాచ. ప్రకృతి అందాలకు పుట్టిలైన కోనసీమలో అనేక దివ్య క్షేత్రాలు, దర్శనీయ స్థలాలు ఉన్నాయి. అయితే ఎటువంటి ఆలయం లేకుండా కొన్ని వందల ఏళ్లుగా ఒక పవిత్ర స్థలంగా ఖ్యాతిగాంచింది కోనసీమ జిలాల్లోని జగ్గన్నతోట. ఇక్కడ ప్రతి ఏడాది కనుమ రోజున ప్రభల తీర్ధం అత్యంత వైభంగా జరుగుతుంది.
మొసళ్ల పల్లిలో తరతరాలనుండీ కనుమ నాడు జరిగే "జగ్గన్నతోట" ప్రభల తీర్థం వైభవం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.. జగ్గన్నతోట ప్రభల తీర్థం ప్రసిద్ధి గాంచిన ప్రభల తీర్ధం 17వ శతాబ్దం జరుగుతోంది. మకర సంక్రమణ ఉత్తరాయణ మహా పుణ్య కాలంలో కనుమ నాడు కోనసీమలోని "మొసలిపల్లి శివారు జగ్గన్నతోట" లో జరిగే ఏకాదశ రుద్రుల సమాగమం అత్యంత ప్రాచీనమైన, చారిత్రాత్మకమైన.. పవిత్రమైన సమాగమం
పురాణాల కథనం ప్రకారం కొన్ని వందల ఏళ్ల క్రితం మొట్టమొదటి గా ఈ తోటలోనే ఈ పదకొండు గ్రామాల రుద్రులు సమావేశమయ్యారని ప్రతీతి. ఈ తోటలో ఏ విధమైన గుడి గానీ, గోపురం గానీ వుండవు. ఇది పూర్తిగా కొబ్బరి తోట. ఈ ఏకాదశ రుద్రులు సంవత్సరానికి ఒకసారి ఇక్కడ సమావేశం అవ్వడం తో ఈ తోటకు విశేష ప్రాధాన్యత లభించింది. ప్రభల తీర్ధం ఏకాదశ రుద్రుల కొలువు. హిందూ ధర్మ శాస్త్రాల ప్రకారము ఏకాదశ రుద్రులు ఒక్కచోట కొలువు తీరేది ప్రపంచం మొత్తం మీదా, ఈ భూమండలం మొత్తానికీ ఒక్క చోటే అదీ వేదసీమ అయినటు వంటి కోనసీమలోనే.
లోక కల్యాణార్ధం ఈ పదకొండు గ్రామాల శివుళ్ళు కనుమ రోజున సమావేశం అయ్యి లోక విషయాలు చర్చిస్తారని ప్రతీతి. సుమారు 400 సంవత్సరాల క్రితం నుండీ ఈ సంప్రదాయం వుందనీ.. తీవ్రమైన పరిస్థితులు వచ్చిన 17 వ శతాబ్ధములో ఈ 11 గ్రామాల రుద్రులు ఈ తోటలోనే సమావేశం అయ్యి లోక రక్షణ గావించారనీ ప్రతీతి.
అప్పటి నుండీ క్రమం తప్పకుండా ప్రతీ ఏడాది కనుమ రోజు ఎన్ని అవాంతరాలు ఎదురైనా , భూమి తల్లక్రిందులైనా ఈ రుద్రులను ఒక్కచొట చేర్చుతారు ఈ గ్రామస్తులు. సంస్థానదీశులైన శ్రీ రాజా వత్సవాయి జగన్నాధ మహారాజు కు చెందిన ఈ తోట జగ్గన్న తోట అనే పేరుతో స్థిరపడింది.
ఈ ఏకాదశ రుద్రులు కొలువైన గ్రామాలు స్వామి వారలను "ప్రభలపై" అలంకరించి మేళ తాళాలతో, మంగళ వాయిద్యాలతో, భాజా బజంత్రీలతో "శరభా శరభా" హర హర మహాదేవ" అంటూ ఆయా గ్రామాల నుంచి వీరిని మోస్తూ ఈ తోటకు తీసుకువస్తారు.
మొసలపల్లి కి చెందిన మధుమానంత భొగేశ్వరుడు మిగతా గ్రామ రుద్రులకు ఆతిధ్యము ఇస్తారు. ఈ రుద్రుడు అన్ని ప్రభల కన్నా ముందే తోటకు చేరుకుని అందరు రుద్రులూ తిరిగి వెళ్లిన తరువాత వెళ్లడం ఆనవాయితీ.ఈ ఏకాదశ రుద్రులకు అద్యక్షత వహించేది వ్యాఘ్రేశ్వారానికి చెందిన రుద్రుడు "శ్రీ వ్యాఘ్రేశ్వరుడు".ఈ వ్యాఘ్రేశ్వరుడు కి చెందిన ప్రభ తోటలోకి రాగానే మిగతా రుద్ర ప్రభలన్నింటినీ మర్యాదా పుర:స్సరంగా ఒక్కసారి లేపి మళ్ళి కిందకు దించుతారు. ఈ 11 శివుళ్ళకు వ్యాఘ్రేశ్వరుడు అధిష్టానము.
ఇక్కడ మరో విశిష్టత ఏమిటీ అంటే గంగలకుర్రు మరియూ గంగలకుర్రు(అగ్రహారం) రుద్ర ప్రభలు ఈ తోట కి రావాలంటే మధ్యలో కాలువ(కౌశిక) దాటాలి.ఆ ప్రభలు ఆ కాలువలోంచి ఏ మాత్రం తొట్రూ లేకుండా "హరా హరా" అంటూ తీసుకువచ్చే ఆ గ్రామస్తుల ధైర్యం చూడడానికి రెండు కళ్ళు చాలవు.
అయితే ఇప్పుడు కోనసీమలో కనుమ రోజున జరిగే ప్రభల తీర్ధానికి అరుదైన గుర్తింపు దక్కింది. దేశ రాజధాని ఢిల్లీ లో జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఆంధ్రప్రదేశ్ శకటం సందడి చేయనుంది. ఈ వేడుకల్లో కోనసీమలో ప్రబలతీర్ధం పేరుతో జరిగే సంక్రాంతి ఉత్సవం ఇతివృత్తంగా ఆంధ్రప్రదేశ్ శకటం ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.
సంక్రాంతి 10 రోజుల ముందు ఒక మంచి రోజు చూసి మరీ ప్రభ తయారీ మొదలు పెడతారు. ప్రతి గ్రామానికి ప్రభ నిర్మాణానికి కావలిసిన వస్తు సామాగ్రి ఉంటుంది. వెదురు కర్రలను అందంగా వంచి.. ప్రభకు ఒక ఆకారాన్ని తీసుకొస్తారు. వెదురు బొంగులను కలపడానికి కొబ్బరి తాడుని ఉపయోగిస్తారు. ప్రభని అందంగా అలంకరించేందుకు రంగురంగుల వస్త్రాన్ని ఉపయోగిస్తారు. పూలతో, కలర్స్ పేపర్స్ తో అలంకరించి శివయ్యను ఏర్పాటు చేస్తారు. ఇలా ప్రభను తయారు చేసే సమయంలో ఎంతో నియనిష్ఠలను అనుసరిస్తారు.