
పశుపతినాథ్ ఆలయం, నేపాల్: లోయల మధ్య ఉన్న నేపాల్ రాజధాని ఖాట్మండులో చాలా ప్రసిద్ధి చెందిన ఆలయం పశుపతినాథ్ ఆలయం. భాగమతి నది ఒడ్డున ఉన్న పశుపతినాథ్ శివుడికి అంకితం చేయబడింది. పశుపతినాథ్ ఆలయంలో మరణించడం వలన జీవితంలో చేసిన పాపాలతో సంబంధం లేకుండా మానవుడిగా పునర్జన్మ లభిస్తుందనే నమ్మకం. భారీ సంఖ్యలో పశుపతినాథ్ ఆలయాన్ని సందర్శించడానికి భక్తులు ఇక్కడికి వస్తారు. ఈ అందమైన ఆలయాన్ని చూడటానికి ప్రపంచం నలుమూలల నుండి ప్రజలు వస్తారు. దీనిని 1979 నుండి యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది. ప్రధాన ఆలయంలోకి హిందువులను మాత్రమే అనుమతిస్తారు.

మున్నేశ్వరం ఆలయం శ్రీలంక: ఈ ఆలయ చరిత్ర రామాయణ కాలంతో ముడిపడి ఉందని చెబుతారు. పురాణాల ప్రకారం రావణుడిని ఓడించిన తర్వాత రాముడు ఇక్కడ శివుడిని పూజించాడు. శివుడికి అంకితం చేయబడిన ఈ ఆలయ సముదాయం వెయ్యి సంవత్సరాలకు పైగా పురాతనమైనదని నమ్ముతారు. పోర్చుగీస్ ఆక్రమణ వలన ఈ ఆలయం రెండుసార్లు నాశనమైంది. స్థానికుల సహాయంతో ఆలయాలను పునరుద్ధరించారు. ఈ ఆలయాన్ని సందర్శించడానికి ప్రతిరోజూ వందలాది మంది భక్తులు, పర్యాటకులు వస్తారు.

కటాస్ రాజ్ దేవాలయం పాకిస్థాన్: అఖండ భారత దేశం నుంచి విడిపోయి పాకిస్తాన్ గా ఆవిర్భించింది. ఈ దేశంలో కూడా అందమైన పురాతనమైన హిందూ దేవాలయాలున్నాయి. పంజాబ్ ప్రావిన్స్లో ఉన్న కటాస్ రాజ్ దేవాలయం అత్యంత సుందరమైన ఆలయం. ఇక్కడ నీటి కొలనులు, పచ్చదనం, పురాతన వాస్తుశిల్పాలు పర్యాటకులను ఆకర్షిస్తాయి. వివిధ ఆలయ నిర్మాణాలు, శిథిలాల మధ్య ఉన్న కటాస్ చెరువును హిందువులు పవిత్రంగా భావిస్తారు. పురాణాల ప్రకారం ఇక్కడ ఉన్న చెరువు శివుడు తన భార్య సతి మరణానికి దుఃఖిస్తున్నప్పుడు ఆయన కన్నీళ్ల నుంచి సృష్టించబడింది. ఈ చెరువులోని నీరు శివుని శక్తుల సహాయంతో పాపాలను కడిగివేస్తుందని నమ్ముతారు.

ప్రంబనన్ ఆలయం, జావా: ఇండోనేషియాలోని జావాలో ఉన్న ప్రంబనన్ ఒక పెద్ద హిందూ సముదాయం. ప్రంబనన్ ఆలయ సమ్మేళనం 9వ శతాబ్దానికి చెందినది. దీనిని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా కూడా ప్రకటించింది. ఇది బ్రహ్మ, విష్ణు , మహేశ్వర (శివుడు) అనే ముగ్గురు దేవుళ్లకు సంబంధించినది. ఈ సముదాయంలో దాదాపు 240 దేవాలయాలు ఉన్నాయి. వాటిలో అతిపెద్దది శివుడికి అంకితం చేయబడింది. శివాలయం 47 మీటర్ల ఎత్తు, దాని శిఖరం దూరం నుండి కనిపిస్తుంది. భద్రతా కారణాల దృష్ట్యా చాలా దేవాలయాల లోపలి భాగం సందర్శకులకు మూసివేయబడింది.

ముక్తి గుప్తేశ్వర్, ఆస్ట్రేలియా: శివుడికి అంకితం చేయబడిన ఈ ఆలయ సముదాయం ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్ నగరంలో ఉంది. ఇది మొట్టమొదటి.. ఏకైక మానవ నిర్మిత గుహ ఆలయం. ఈ ఆలయం 13వ జ్యోతిర్లింగానికి సంబంధించినదని నమ్ముతారు. యాత్రికులు, భక్తులు భారీ సంఖ్యలో ఇక్కడికి చేరుకుంటారు. ముక్తి గుప్తేశ్వర్ సొసైటీ ప్రకారం గుహ ఆలయం తెలివితేటలను, అంతర్గత స్వభావాన్ని సూచిస్తుంది.

గౌరీశంకర్ ఆలయం (నేపాల్): ఈ శివాలయం కూడా మన పొరుగు దేశం నేపాల్ లోనే ఉంది. ఈ ఆలయంలో ఆది దంపతులు శివపార్వతులు కొలువయ్యారు. ఈ ఆలయం ఖాట్మండుకు 100 కిలోమీటర్ల దూరంలో ఉంది.

కౌయి హిందూ మఠం (అమెరికా) హవాయిలోని ఉష్ణమండల వర్షారణ్యాలు, ఉప్పొంగుతున్న జలపాతాల మధ్య ఉన్న కౌయి అనే ఉద్యానవన ద్వీపంలో కౌయి హిందూ మఠం అనే అందమైన ఆలయం ఉంది. ఇక్కడ శివుడు తన తనయులైన గణపతి, కార్తికేయుడితో కలిసి పూజలను అందుకుంటున్నాడు. 1970లో ఈ ఆలయం నిర్మాణం జరుపుకుంది.

అరుల్మిగు శ్రీరాజ కాళియమ్మన్ ఆలయం(మలేషియా)" ఈ ప్రసిద్ధ శివాలయం మలేషియాలో ఉంది. ఈ ఆలయాన్ని 1922లో నిర్మించారు. ఈ ఆలయం పూర్తిగా గాజుతో నిర్మించారు. దీని గోడల పై దాదాపు 30,00,00 రుద్రాక్ష పూసలు పొదిగారు.