
తీవ్రమైన వేడిలో కొంచెం నూనె కలిపిన ఆహారం తీసుకున్నా అజీర్ణం, అసిడిటీ వంటి సమస్యలు తలెత్తుతాయి. స్పైసీ ఫుడ్ లేదంటే ఆయిల్ ఫుడ్ తిన్న తర్వాత ఈ డ్రింక్ తాగారంటే ఆహారం త్వరగా జీర్ణం అవుతుందంటున్నారు ఆరోగ్య నిపుణులు.

వేసవిలో శరీరం ఎల్లప్పుడూ చల్లని పానీయాలను కోరుకుంటుంది. ఈ పానీయం శరీరాన్ని చల్లగా ఉంచడంతోపాటు తిన్న ఆహారం జీర్ణం చేస్తుంది కూడా. అదే పుదీనా-జీలకర్ర జ్యూస్. శరీరాన్ని చల్లగా ఉంచడానికి పుదీనా ఆకులు ఉపయోగపడితే.. జీలకర్ర జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. చాలా మంది జీర్ణ సమస్యలను తొలగించడానికి జీలకర్ర నీటిని తాగుతుంటారు. ఇప్పుడు ఈ రెండు పదార్థాలతో డైజెస్టివ్ డ్రింక్ అయిన స్పైసీ నిమ్మరసం ఎలా తయారు చేస్తారో ఇక్కడ చూద్దాం..

ఈ డ్రింక్ తయారు చేయడానికి పుదీనా ఆకులు, కొత్తిమీర ఆకులు, అల్లం, జీలకర్ర, సోంపు, నిమ్మరసం, మిరియాల పొడి, రుచికి తగిన ఉప్పు, నీరు అవసరం. ముందుగా పుదీనా ఆకులు, కొత్తిమీర ఆకులను నీటి మోతాదుకు సరిపడా తీసుకోవాలి. 2 గ్లాసుల నీటిని తీసుకుంటే, 2 నిమ్మకాయల రసం,1 చెంచా జీలకర్ర, కాసిన్ని సోపు పొడిని తీసుకోవాలి.

ముందుగా పుదీనా ఆకులు, కొత్తిమీర ఆకులను బాగా కడిగి తరగాలి. అల్లం తొక్క తీసి తురుము కోవాలి. ఇప్పుడు అల్లం, పుదీనా ఆకులు, కొత్తిమీర ఆకులు, జీలకర్ర, మెంతులు కలిపి పేస్ట్ లాగా రుబ్బుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద గిన్నెలో 2 నిమ్మకాయల రసాన్ని పిండి, అందులో జీలకర్ర, సోపు, పుదీనా, కొత్తిమీర పేస్ట్ కలపాలి. ఇప్పుడు 2 గ్లాసుల నీరు పోసి చెంచాతో బాగా కలుపుకోవాలి.

నీరు, నిమ్మరసం బాగా కలిపిన తర్వాత పుదీనా, కొత్తిమీర పేస్ట్ వేసుకోవాలి. అందులో కొద్దిగా ఉప్పు, కొద్దిగా పంచదార, కొద్దిగా మిరియాల పొడి వేసి బాగా కలపాలి. అన్ని పదార్థాలు కలిపి తర్వాత స్ట్రైనర్ ద్వారా వడకట్టుకోవాలి. అంతే స్పైసి నిమ్మరసం సిద్ధం. ఇప్పుడు పైన కొన్ని తరిగిన పుదీనా ఆకులు, ఐస్ క్యూబ్స్ వేసుకుని సర్వ్ చేసుకుంటే సరి.