
కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా త్రివిద దళాల కోసం అగ్నిపథ్ పథకాన్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఆ స్కీమ్ కింద ఎంపికైన వాళ్లని అగ్నివీర్లుగా పిలుస్తున్నారు. అయితే ఈ పథకంపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో అగ్నివీరులకు ఉపయోగపడేలా పలు మార్పులు తీసుకురానున్నట్లు తెలుస్తోంది.

అగ్రివీర్ల కాల పరిమతిని అలాగే వారి వయస్సును పెంచే ఆలోచనలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం.. ఇందులో ఎంపికైన యువతలో కేవలం 25 శాతం మందికే నాలుగేళ్ల తర్వాత ఆర్మీలో రెగ్యులరైజ్ చేయడం జరుగుతుంది. కానీ ఇప్పుడు ఈ 25 శాతం నుంచి 50 శాతానికి ఆర్మీలోని రెగ్యులర్ క్యాడర్లలో తీసుకొనేలా కేంద్రం నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

సాంకేతిక నేపథ్యం ఉన్న యువకులను తీసుకోవడం.. గరిష్ఠ వయస్సును 21 నుంచి 23 ఏళ్లకు పెంచాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను దృష్టిలో ఉంచుకొని ఈ విధంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

2022 జూన్లో ప్రారంభించిన అగ్నిపథ్ పథకం కింద 17.5-21 ఏళ్ల వయస్సు గల అభ్యర్థులను అగ్నివీర్ల పోస్టుల కోసం పరిశీలిస్తున్నారు. మరోవైపు సాంకేతిక నేపథ్యం ఉన్న అభ్యర్థుల విషయంలో వయోపరిమితిని సడలించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న 21 ఏళ్ల వయోపరిమితిని 23 ఏళ్లకు పెంచడంపై చర్చలు జరుగుతున్నాయి.

2026 నాటికి దాదాపు 1.75 లక్షల మంది యువకులను అగ్నిపథ్ స్కీమ్ కింద చేరనున్నట్లు అంచనా వేస్తున్నారు అధికారులు. మరో విషయం ఏంటంటే ప్రతీ ఏడాది దాదాపు 60 వేల మంది సైనికులు రిటైర్ అవుతున్నారు. దీంతో మూడు దళాల్లో సైనికుల కొరత ఎదురవుతోంది. అందుకే ఈ పథకంలో మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది.