
బ్రేక్ ఫాస్ట్ ఎందుకు ముఖ్యం: రాత్రి భోజనం తర్వాత దాదాపు 8 నుండి 10 గంటల పాటు మన శరీరం ఆహారం లేకుండా ఉంటుంది. నిద్ర లేచిన తర్వాత శరీరానికి, మెదడుకు తక్షణ శక్తి అవసరం. ఉదయాన్నే అల్పాహారం తీసుకోవడం ద్వారా శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి. దీనిని దాటవేయడం వల్ల శరీర పనితీరు మందగించి, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది.

అల్పాహారం మానేసే వారికి టైప్-2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం 30 శాతం ఎక్కువగా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఉదయం ఆహారం తీసుకోకపోతే రక్తంలోని గ్లూకోజ్ స్థాయిల్లో అసమతుల్యత ఏర్పడుతుంది. రక్తంలో చక్కెరను నియంత్రించడానికి శరీరం అధికంగా ఇన్సులిన్ను ఉత్పత్తి చేయాల్సి వస్తుంది. దీనివల్ల క్లోమ గ్రంథి త్వరగా అలసిపోయి, ఇన్సులిన్ నిరోధకతకు దారితీస్తుంది. ఇది చివరికి మధుమేహంగా మారుతుంది.

చాలా మంది అల్పాహారం మానేస్తే కేలరీలు తగ్గి బరువు తగ్గుతామని భావిస్తారు. కానీ సోషల్ మీడియాలో వచ్చే ఈ వార్తలు పూర్తిగా అవాస్తవం. ఉదయం పూట ఏమీ తినకపోవడం వల్ల మధ్యాహ్నానికి ఆకలి విపరీతంగా పెరుగుతుంది. దీనివల్ల భోజన సమయంలో తెలియకుండానే ఎక్కువ ఆహారం తీసేసుకుంటారు. తీవ్రమైన ఆకలి వల్ల మనసు ఫాస్ట్ ఫుడ్, స్నాక్స్ లేదా స్వీట్ల వైపు మొగ్గు చూపుతుంది.

మెటబాలిజం మందగించడం: ఆహారం లేకపోవడం వల్ల జీవక్రియ నెమ్మదిస్తుంది. దీనివల్ల శరీరంలో కేలరీలు తక్కువగా బర్న్ అయ్యి, కొవ్వు రూపంలో నిల్వ చేరతాయి. ఫలితంగా బరువు తగ్గడానికి బదులు మరింత పెరుగుతారు.

శక్తి తగ్గుదల - అలసట: జీవక్రియ నెమ్మదించడం వల్ల శరీరంలో శక్తి స్థాయిలు పడిపోతాయి. దీనివల్ల రోజంతా నీరసంగా ఉండటం ఏ పనిపైనా ఏకాగ్రత కుదరకపోవడం, త్వరగా అలసిపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి. ఆరోగ్యంగా ఉండాలంటే ఉదయం పూట పోషకాలున్న ఆహారాన్ని ఖచ్చితంగా తీసుకోవాలి. అల్పాహారం అనేది కేవలం ఆకలి తీర్చుకోవడమే కాదు.. అది మీ రోజువారీ ఆరోగ్యానికి పునాది.