యుక్తవయసులో మొటిమలు రావడం సర్వ సాధారణం. దీనికి మూలం శరీరంలో హార్మోన్ల మార్పులు. సాధారణంగా మొటిమలు ముఖం మీదేకాకుండా వీపు, ఛాతీ, భుజాల మీదా కూడా వస్తుంటాయి. అయితే కొన్ని జాగ్రత్తలతో ఈ సమస్య నుంచి బయటపడొచ్చు.
వేపనూనె, ముల్తానీ మిటీ, తులసి పొడి.. వీటిని వినియోగిస్తే మొటిమల సమస్య ఇట్టే మాయం అవుతుంది. వేపనూనెలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. ఇందులో ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి.
ఇవేకాకుండా ఈ నూనెలో విటమిన్ ఇ చాలా ఎక్కువ మొత్తంలో ఉంటుంది. అందుకే మన పూర్వికులు శతాబ్దాలుగా వేపనూనెను ఉపయోగిస్తున్నారు. చర్మంపై వచ్చే మొటిమలను పోగొట్టడమే కాకుండా పొడి చర్మం, ముడతలు, చర్మపు మచ్చలు, దురద, అలర్జీ సమస్యల నుంచి కూడా బయటపడవచ్చు
ఇది చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా, ప్రకాశవంతంగా మార్చుతుంది. అందుకే అనేక చర్మ సమస్యలను నయం చేయడానికి వైద్యులు వేప నూనెను ఉపయోగిస్తుంటారు.
నూనె రాసుకునే ముందు ముఖాన్ని బాగా శుభ్రం చేసుకోవాలి. తర్వాత ఒక పాత్రలో 2 నుంచి 3 చెంచాల వేపనూనె తీసుకుని కాటన్ సహాయంతో ముఖానికి పట్టించాలి. ఆ తర్వాత రాత్రంతా అలాగే ఉంచుకుని ఉదయాన్నే లేచి కడుక్కోవాలి. అవసరమైతే కొద్దిగా వెచ్చని నీళ్లతో కడిగేసుకోవచ్చు. ఇలా రోజూ చేయడం వల్ల క్రమంగా మంచి ఫలితాలను పొందుతారు.