
ఇక్కడ కనిపిస్తున్న జెల్లీఫిష్ సముద్రంలో అత్యంత వేగంగా కదిలిపోతుంది. దీనిని ట్రాక్ చేయడం చాలా కష్టం. ఇటువంటి జీవులు సముద్ర జలాల్లో చాలా జీవిస్తూ ఉంటాయి. వాటి జీవన విధానం పరిశోధించాలంటే వాటిని ట్రాక్ చేయగలగాలి.

సముద్రంలో పరిశోధనల కోసం పరిశోధకులు చేసే ప్రయత్నాల్లో వారు సముద్రపు లోతుల్లోకి వెళ్ళడానికి ఉపయోగించే వాహనాలే వారికి ఇబ్బందులు తెస్తాయి. వీటి నుంచి వచ్చే ధ్వని..కాంతికి భయపడి చాలా సముద్ర జీవులు అక్కడి నుంచి పారిపోతాయి.

ఈ సమస్యను పరిష్కరించడానికి పరిశోధకులు ఒక మార్గాన్ని కనిపెట్టారు. అదే రోబోట్. నీటి అడుగున సమర్ధవంతంగా పనిచేసే రోబోట్ ను పరిశోధకులు సిద్ధం చేశారు. దీని సహాయంతో ఎటువంటి శబ్దం లేకుండా వేగంగా కదిలిపోయే సముద్ర జీవులను ట్రాక్ చేసే అవకాశం దొరుకుతుంది.

మేసోబాట్ గా చెప్పుకునే ఈ రోబో సముద్ర జీవులను ట్రాక్ చేసి వాటిని పూర్తిగా ఒకరోజంతా వెంటాడుతూ పరిశీలిస్తుంది. ఇది ఆ జీవికి కూడా తెలీకుండా జరిగిపోతుంది. ఇది సైన్స్ పరిశోధనల్లో గొప్ప ముందడుగా మెరైన్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఈ ఆవిష్కరణ ద్వారా సముద్ర జీవుల పూర్తి జీవన చిత్రాన్ని పరిశీలించి.. పరిశోధనలు చేయడానికి అవకాశం లభిస్తుందని పరిశోధకులు భావిస్తున్నారు. భవిష్యత్ లో మరిన్ని కోణాల్లో సముద్రగర్భంలోని విశేషాలను తెలుసుకునే అవకాశం ఈ మేసోబాట్ ల ద్వారా దొరుకుతుందని వారు భావిస్తున్నారు.