RBI: బ్యాంకు కస్టమర్లకు మరింత భద్రతను ఇచ్చేందుకు ఆర్బీఐ కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. జూలై 1 నుంచి అన్ని క్రెడిట్, డెబిట్ కార్డులకు సంబంధించి నిబంధనలలో మార్పులు అమలు కానున్నాయి. కొత్త నిబంధనల ప్రకారం ఆన్లైన్ మర్చంట్ కంపెనీలు కస్టమర్ల కార్డ్ డేటాను నిల్వ చేయకూడదు. ఇందుకు సంబంధించి కేంద్ర బ్యాంక్ ఆర్బీఐ(RBI) గతేడాది ప్రవేశపెట్టిన ‘టోకెనైజేషన్' నిబంధనలను కంపెనీలు జులై 1 నుంచి అమలు చేయనున్నాయి.
దేశీయ ఆన్లైన్ కొనుగోళ్లకు కార్డ్-ఆన్-ఫైల్ టోకెన్ విధానాన్ని ఆర్బీఐ గత సంవత్సరం తప్పనిసరి చేసింది. కార్డ్-ఆన్-ఫైల్ టోకెన్ విధానంలో క్రెడిట్ లేదా డెబిట్ కార్డు వివరాలను ఎన్క్రిప్టెడ్ ‘టోకెన్’ రూపంలో భద్రపరుస్తారు.
దీంతో ఈ టోకెన్ల సాయంతో కార్డ్ వివరాలను వెల్లడించకుండానే కస్టమర్లు ఆన్లైన్ పేమెంట్లు చేసేందుకు అవకాశం ఉంటుంది. ఇందుకోసం ఒరిజినల్ కార్డ్ డేటా స్థానంలో ఎన్క్రిప్టెడ్ డిజిటల్ టోకెన్ను తీసుకోవాల్సి ఉంటుంది.
రిజర్వ్ బ్యాంకు తీసుకువస్తున్న ఈ నిబంధనలు జూలై 1, 2022 నుంచి అమల్లోకి వస్తాయి. కస్టమర్లు డెబిట్, క్రెడిట్ కార్డ్ వివరాలను మర్చంట్ కంపెనీలు డిలీట్ చేయాల్సి ఉంటుంది.ఈ టోకెన్ విధానంలోకి మార్చే గడువును జనవరి 1, 2022 నుంచి జులై 1, 2022కి ఇప్పటికే ఆర్బీఐ పొడిగించింది.
కాగా, ఆర్బీఐ మార్గదర్శకాలు ఉన్నప్పటికీ కార్డ్ టోకెనైజేషన్ సిస్టం తప్పనిసరి కాదు. సమ్మతంలేని వినియోగదారులు తమ డెబిట్, క్రెడిట్ కార్డు పేరు, కార్డ్ నంబర్, సీవీవీ, ఇతర వివరాలు ఎంటర్ చేసి ఆన్లైన్ పేమెంట్లు చేసుకోవచ్చు