
రెండు వేర్వేరు పాములు కాటేయడంతో హాస్పిటల్కు తీసుకెళ్లేలోపే చిన్నారు మృతి చెందిన ఘటన జనగామ జిల్లాలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. దేవరుప్పుల మండలం ముండిచింతతండాకు చెందిన నాలుగేళ్ల శ్రీయన్ అనే బాలుడు నిద్రలో ఉండగా అతన్ని రెండు వేర్వేరు జాతుల విష సర్పాలు కాటు వేశాయి. మొదట నాగుపాము కాటువేయగా.. కొద్దిసేపటికే మరో రక్తపింజరి ఆ బాలుడిని కాటు వేసింది. దీంతో హాస్పిటల్కు తరలించేలోపే ఆ బాలుడు ప్రాణాలు కోల్పోయాడు.

ఒకేసారి రెండు రకాల పాములు కరిస్తే ఏం జరుగుతుంది? : సాధారణంగా ఒక పాము కరిచినప్పుడే ప్రాణాపాయం ఎక్కువగా ఉంటుంది. అలాంటిది రెండు వేర్వేరు జాతుల పాములు కరిస్తే శరీరంలోని వేర్వేరు వ్యవస్థలు ఒకేసారి కుప్పకూలుతాయి. నాగుపాము లేదా కట్లపాము కరిచినప్పుడు వాటిలో ఉండే న్యూరోటాక్సిన్ అనే విషం నేరుగా మన శరీరంలోని ఊపిరితిత్తులపై ప్రభావం చూపుతుంది. దీనివల్ల తొలుత శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది.అదే ఒక వేళ రక్తపింజరి కరిస్తే అందులోని దానిలో ఉండే హెమోటాక్సిన్ అనే విషం రక్తంలో చేరి దాన్ని మొత్తం విషపూరితంగా మార్చేస్తుంది. అంతేకాదు ఈ పాముల్లో ఉండే సైటోటాక్సిన్ అనే విషం మానవ కణజాలాన్ని పూర్తిగా దెబ్బతీస్తుంది.

శరీరంపై రెట్టింపు ప్రభావం: రెండు వేర్వేరు విషాలు శరీరంలోకి చేరినప్పుడు రెండు రకాల రసాయన చర్యలు మొదలవుతాయి. ఒక పాము విషం మన శ్వాస వ్యవస్థ పనిచేయకుండా చేస్తే..మరో పాము విషం రక్తాన్ని విషపూరితం చేసి ప్రాణాంతకంగా మారుస్తుంది. దీనివల్ల గుండె, కిడ్నీలు వంటి కీలక అవయవాలు విష ప్రభావం పడి వెంటనే అవి పనిచేయడం ఆపేస్తాయి. ఇంకా విషం మోతాదు రెట్టింపు కావడంతో మనిషి కోలుకునే సమయం కూడా ఉండదు.

వైద్యుడు ఏం చెబుతున్నారు: సాధారణంగా పాము కరిచిందంటే వైద్యుల ఏం చేస్తారు. ఏ పాము కరిచిందో తెలిస్తే దానికి తగిన యాంటీ వీనమ్ ఇస్తారు. కానీ ఇలా ఒకే సారి రెండు వేర్వేరు పాము కరిచిన అరుదైన కేసుల్లో ఏ విషానికి విరుగుడు ఇవ్వాలో నిర్ణయించడం వాళ్లకి కూడా కష్టతరం అవుతుంది. అప్పుడు వైద్యులు పాలివాలెంట్ యాంటీ వీనమ్ అనే ఇంజెక్షన్లను ఇస్తారు.

ఎందుకంటే ఇది ముఖ్యంగా మన దేశ పరిసరాల్లో తిరిగే నాలుగు ప్రధాన విష సర్పాల నాగుపాము, కట్లపాము, రెండు రకాల రక్తపింజరులు విషాన్ని విచ్ఛిన్నం చేయగలదు. అయితే, రెండు పాములు కరిచినప్పుడు ఈ ఇంజెక్షన్ల డోసేజ్ కూడా భారీగా పెంచాల్సి ఉంటుంది. అప్పుడే ఇది చాలా ప్రభావవంతంగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు.