
Latest Weather Report: పదిరోజుల పాటు కమ్మేసిన మేఘాలు, కుమ్మేసిన వర్షాలు ప్రస్తుతానికి శాంతించాయ్. కానీ ఒకట్రెండు చోట్ల మాత్రం తెలంగాణలో వర్షసూచన ఉంది. ఏపీలో కూడా అదేపరిస్థితి ఉంటుందని వాతావరణశాఖ పేర్కొంది. బంగాళాఖాతంలో అల్పపీడనం బలహీనపడిందని, కానీ వర్షాలు మాత్రం రెండు మూడు రోజులు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో 7 జిల్లాలకు వర్ష సూచన చేసింది.

IMD ప్రకారం.. తెలంగాణలో ప్రస్తుతం ఎక్కడ కూడా రెడ్ జోన్ లేదు. కొన్ని జిల్లాలకు మాత్రం ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతోంది. అంటే అక్కడ భారీ వర్షాలకు సూచన ఉంది. అవి ఆదిలాబాద్, నిర్మల్, కుమురం భీమ్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని.. హైదరాబాద్ లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

రేపు యావత్ తెలంగాణ పూర్తిగా గ్రీన్ జోన్లో ఉంటుందని వాతావరణ కేంద్రం తెలిపింది. వాతావరణం పూర్తిగా పొడిగా ఉంటుందని.. అక్కడక్కడ వానలు కురిసే అవకాశముందని పేర్కొంది. అల్పపీడన ప్రభావం తగ్గిందని.. ఇప్పుడు వర్షాలు తగ్గుముఖం పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆగస్ట్ రెండోవారం వరకూ వానలు కురిసే అవకాశం లేదని తెలిపింది.

ఏపీలోనూ నైరుతి రుతుపవనాలు యాక్టివ్గా ఉన్నాయని వాతావరణశాఖ తెలిపింది. మరో మూడు రోజులపాటు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. కోస్తాంధ్ర, రాయలసీమజిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురుస్తాయని స్పష్టం చేసింది. 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది.

కాగా.. భారీ వర్షాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఇంకా వరద గుప్పిట్లోనే ఉన్నాయి. ఇప్పుడిప్పుడే వర్షాలు తగ్గుముఖం పట్టడంతో.. వరదల తీవ్రత తగ్గుతోంది.