
మెదడు మానవ శరీరంలోని అత్యంత ముఖ్యమైన అవయవాలలో ఒకటి. ఇంత ముఖ్యమైన మెదడును ఎలా ఆరోగ్యంగా ఉంచుకోవాలో ఎప్పుడైనా ఆలోచించారా? మనం నిత్యజీవితంలో ఎన్నో రకాల కూరగాయలు తింటూ ఉంటాం. కానీ మనకే తెలియకుండా కూరగాయల్లోని వివిధ భాగాలను పాడేస్తుంటాం. కానీ అలా వృధాగా పడేసే వాటిల్లో మెదడుకు మేలు చేసే పోషకాలు ఎన్నో ఉంటాయంటున్నారు పోషకాహార నిపుణులు.

బ్రెయిన్ హెల్త్ కోసం అధిక డబ్బుతో ఖరీదైన ఆహారాన్ని కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు. వృధాగా పడేసే కూరగాయల భాగాలతో కూడా మీ మెదడు ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవచ్చు. పోషకాహార నిపుణుడు నమామి అగర్వాల్ ఇటీవల సోషల్ మీడియాలో ఓ విషయాన్ని వెల్లడించారు. అదేంటంటే..

గుమ్మడి విత్తనాలు మెదడును చురుకుగా ఉంచుతాయి. వీటిల్లోని పోషకాలు దాని పనితీరును పెంచుతాయని పోషకాహార నిపుణుడు నమామి అగర్వాల్ అంటున్నారు.

గుమ్మడి గింజలు మెదడుకు ఎంతో మేలు చేస్తాయని పోషకాహార నిపుణులు తెలిపారు. ఎందుకంటే ఇందులో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. మెగ్నీషియం సమృద్ధిగా ఉన్న గుమ్మడికాయ గింజలు, నరాల జీవరసాయన ప్రక్రియలలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. మెగ్నీషియం న్యూరోట్రాన్స్మిషన్, సినాప్టిక్ ప్లాస్టిసిటీలో సహాయపడుతుంది.

అంతేకాకుండా గుమ్మడి గింజలలో జింక్, కాపర్, యాంటీఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. మెదడు పనితీరులో ఇవన్నీ కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. మెదడుతో పాటు గుమ్మడి గింజలు గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. రక్తంలో చక్కెర స్థాయిని కూడా ఇవి అదుపులో ఉంచుతాయి.