
ఈ నెల 28వ తేదీ నుంచి ప్రారంభం కానున్న మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్లే మహిళలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది. మేడారం సందర్భంగా తిప్పనున్న ప్రత్యేక బస్సుల్లోనూ మహాలక్ష్మి పథకం అమల్లో ఉంటుందని టీజీఎస్ఆర్టీసీ ప్రకటించింది. జాతర కోసం ప్రవేశపెట్టిన స్పెషల్ ఎక్స్ప్రెస్ బస్సుల్లోనూ మహిళలు ఉచితంగా ప్రయాణం చేయవచ్చని తెలిపింది. ఈ మేరకు అధికారులు స్పష్టతిచ్చారు.

జాతర కోసం తిప్పే ప్రత్యేక బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ఉంటుందా..? ఉండదా? అనే అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఇది ఆర్టీసీ అధికారుల దృష్టికి వెళ్లడంతో.. మహిళల అనుమానాలు తొలగించేందుకు ఈ ప్రకటన చేశారు. మేడారం జాతర కోసం రాష్ట్ర నలుమూలల అన్ని డిపోల నుంచి ప్రత్యేక బస్సులను ప్రకటించారు. ఈ బస్సుల్లో కూడా మహాలక్ష్మి పథకం వర్తిస్తుందని వెల్లడించారు.

మహిళలతో పాటు ట్రాన్స్జెండర్లు, బాలికలు జాతర ప్రత్యేక బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చని టీజీఎస్ఆర్టీసీ వెల్లడించింది. ఇప్పటికే ప్రత్యేక బస్సుల ఛార్జీల వివరాలను అధికారులు రిలీజ్ చేశారు. హైదరాబాద్ నుంచి మేడారంకు వెళ్లే ప్రత్యేక ఎక్స్ప్రెస్ బస్సుల్లో రూ.600, సెమీ డీలక్స్ బస్సుల్లో రూ.650గా నిర్ణయించారు.

ఇక హన్మకొండ నుంచి మేడారం వెళ్లే ఎక్స్ప్రెస్ బస్సుల్లో రూ.250, సెమీ డీలర్స్ బస్సుల్లో రూ.270 వసూలు చేయనున్నారు. ఇక వరంగల్ నుంచి మేడారం వెళ్లే ఎక్స్ప్రెస్ బస్సుల్లో రూ.250, సెమీ డీలక్స్కు రూ.270గా నిర్ణయించారు. ఇక కరీంనగర్ నుంచి మేడారంకు రూ.390, ఖమ్మం నుంచి రూ.480 వసూలు చేస్తారు

అలాగే జనగామ నుంచి మేడారంకు ఎక్స్ప్రెస్ బస్సుల్లో రూ.400, సెమీ డీలక్స్ బస్సుల్లో రూ.430 టికెట్ ఛార్జీ ఉంటుంది. అటు మహబూబాబాద్ నుంచి వెళ్లే బస్సుల్లో రూ.360, కొత్తగూడెం నుంచి వెళ్లే బస్సుల్లో రూ.350, గోదావరి ఖని నుంచి వెళ్లే బస్సుల్లో రూ.480 వసూలు చేయనున్నారు.