
అది భారత్-పాకిస్థాన్ బార్డర్. రెండు దేశాలకు మధ్య ఒక్క గేటు మాత్రమే అడ్డు. అదే పంజాబ్లోని అట్టారీ, వాఘా సరిహద్దు. ఇక్కడ జరిగే బీటింగ్ రిట్రీట్ కార్యక్రమం చూడడానికి నిజంగా రెండు కళ్లు సరిపోవు.

భారత్ - పాకిస్థాన్ రెండు దేశాల సైనికులు ఎదురుపడి పరస్పరం సెల్యూట్ చేసుకుని నిర్వహించే బీటింగ్ రిట్రీట్ చూస్తుంటే, రోమాలు నిక్కబొడుచుకుంటాయి. అంత ఉద్విగ్నభరితంగా ఉంటుంది సీన్. హిందుస్థాన్ జిందాబాద్ అనే నినాదాలు వినబడుతుండగా పరేడ్ చేస్తారు మన బీఎస్ఎఫ్ జవాన్లు.

ఇరు దేశాల సైనికులు ఒకరిపై ఒకరు కొట్లాటకు వెళ్తున్నారా అన్నట్టుగా ఈ కార్యక్రమం సాగుతుంది. రిపబ్లిక్ డే సందర్భంగా అట్టారీ-వాఘా బార్డర్లో సరిహద్దు భద్రతా దళం, పాకిస్థాన్ సైన్యం మిఠాయిలు పంచుకుని శుభాకాంక్షలు తెలుకున్నాయి.

రిపబ్లిక్ డే సందర్భంగా అట్టారీ వాఘా బోర్డర్లో నిర్వహించిన బీటింగ్ రిట్రీట్ పరేడ్ చూసేందుకు సైనికులతో పాటు పంజాబ్ ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో వచ్చారు. రిపబ్లిక్ డే రోజునే కాదు, నూతన సంవత్సరం సందర్భంగా భారత్, పాకిస్థాన్ సైనికులు విషెష్ చెప్పుకున్నారు.

గతేడాది దీపావళి సందర్భంగా అట్టారీ-వాఘా సరిహద్దులో భారత్ సైన్యం, పాకిస్థాన్ సైన్యం మిఠాయిలు పంచుకున్నాయి. ఇలాంటి కార్యక్రమాల వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, కామెంట్లు చేస్తుంటారు నెటిజన్లు.