
గోరఖ్పూర్ రైల్వే స్టేషన్ పునరాభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం (జులై 7) శంకుస్థాపన చేయనున్నారు. దాదాపు రూ.498 కోట్ల వ్యయంతో గోరఖ్పూర్ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు జరగనున్నాయి.

అదే రోజున గోరఖ్పూర్ రైల్వే స్టేషన్ నుంచి రెండు వందేభారత్ రైళ్లను కూడా ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించనున్నారు.

గోరఖ్పూర్-లక్నో వందే భారత్ ఎక్స్ప్రెస్, జోధ్పూర్- అహ్మదాబాద్ (సబర్మతి) వందే భారత్ ఎక్స్ప్రెస్.. ఈ రెండు వందేభారత్ రైళ్లు వచ్చే శుక్రవారం నాడు ప్రధాని మోదీ ప్రారంభిస్తారు.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ముఖ్యమైన నగరాలకు కలుపుకుంటూ ఈ రైళ్లు పరుగులు పెట్టనున్నాయి. దీంతో పర్యాటక రంగం పుంజుకోనుంది. సామాజిక ఆర్థిక అభివృద్ధికీ దోహదం చేస్తుంది.

శుక్రవారం తెల్లవారుజామున ప్రధాన మోదీ గోరఖ్పూర్లోని గీతా ప్రెస్ని సందర్శిస్తారు. గీతా ప్రెస్లోని లీలా చిత్ర ఆలయాన్ని కూడా ప్రధాని సందర్శించనున్నారు. అనంతరం చారిత్రక ప్రింటింగ్ ప్రెస్లో నిర్వహించే శతాబ్ది ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో చిత్రమయ శివపురాణ గ్రంథాన్ని మోదీ చేతుల మీదుగా విడుదల చేయనున్నారు.