
అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా 508 రైల్వే స్టేషన్స్ను పునరుద్ధరించనున్నారు. వీటిలో రాజస్థాన్, ఉత్తరప్రదేశ్లో 55 రైల్వే స్టేషన్లు ఉన్నాయి. అలాగే మధ్యప్రదేశ్లో 34, తెలంగాణలో 21, బిహార్లో 49, మహారాష్ట్రలో 44 రైల్వే స్టేషన్స్కు శంకుస్థాపన చేయనున్నరు. వీటితో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో రైల్వే స్టేషన్స్కు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 6వ తేదీన, ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దేశవ్యాప్తంగా 508 రైల్వే స్టేషన్ల పునరుద్ధరణకు శంకుస్థాప చేస్తారు. రైల్వేలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపిన ప్రధాని, ఇందులో భాగంగానే రైల్వే స్టేషన్స్లో ప్రపంచ స్థాయి సౌకర్యాలను కల్పించే దిశగా అడుగులు వేస్తున్నట్లు గతంలో చాలా సార్లు తెలిపారు.

ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం రూ. 24,470 కోట్లను ఖర్చు చేయనున్నారు. ఇందులో భాగంగా రైల్వే స్టేషన్స్ను 'సిటీ సెంటర్స్'గా అభివృద్ధి చేయనున్నారు.

రైల్వే స్టేషన్స్ను ఆధునీకరించడంలో భాగంగా ఇంటర్ మోడల్ ఇంటిగ్రేషన్, ట్రాఫిక్ సర్క్యూలేషన్ వంటి పనులు చేపట్టనున్నారు. అలాగే రైల్వే స్టేషన్స్ భవనాల రూపకల్పనలో స్థానిక సంస్కృతి, వారసత్వం, వాస్తు శిల్పం ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు.

ఖజుహో జంక్షన్, రైల్వే స్టేషన్ పునరుద్ధరణకు రూ. 260 కోట్లు ఖర్చు చేయనున్నారు. అలాగే రాజస్థాన్లోని జోధ్పూర్ రైల్వే స్టేషన్కు రూ. 494 కోట్లు, హైదరాబాద్ రైల్వే స్టేషన్కు రూ. 309 కోట్లు, ఉత్తర ప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ జంక్షన్ అభివృద్ధికి ఏకంగా రూ. 960 కోట్లు ఖర్చు చేయనున్నారు.

ఆగస్టు 6వ తేదీన దేశ వ్యాప్తంగా వివిధ రైల్వే స్టేషన్స్లో జరగనున్న శంకుస్థాపన పనులకు ఆయా రాష్ట్రాలకు చెందిన కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, స్థానిక ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు.

ఇందులో భాగంగానే రైల్వే మంత్రిత్వ శాఖ ఆధ్వార్యంలో ఇప్పటికే దేశవ్యాప్తంగా విద్యార్థులకు పెయింటింగ్, వ్యాస రచనల్లో పోటీలు నిర్వహించారు. ఇందులో గెలుపొందిన వారికి ఆగస్టు 6వ తేదీ బహుమతులు ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమానికి 2 లక్షల మంది విద్యార్థులు పాల్గొంటారని అంచనా.

తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా తెలంగాణలో 21 రైల్వే స్టేషన్స్, ఆంధ్రప్రదేశ్లో 18 రైల్వే స్టేషన్ల రూపం మారనుంది.

దేశంలోని రైల్వే స్టేషన్స్లో ప్రపంచస్థాయి సౌకర్యాలను అందించాల్సి అవసరం ఉందని చెప్పిన ప్రధాని మోదీ సూచనల మేరకు.. దేశంలోని 1309 స్టేషన్లను ఆధునికీకరణ చేసేందుకు ‘‘అమృత్ భారత్ స్టేషన్ పథకం’’ చేపట్టారు.