
ఏడాది పొడవునా లభించే పండ్లలో అరటిపండు ఒకటి. అరటిపండ్లను పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టంగా తింటారు. అయితే అరటిపండ్లను ఎల్లప్పుడు సరైన పద్ధతిలోనే తినాలి. తద్వారా వీటిల్లోని పోషకాలను పూర్తిగా పొందొచ్చు.

ఉదయం నిద్రలేచిన తర్వాత అరటిపండ్లు తినడం వల్ల శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. ఇందులో ఉండే విటమిన్ బి6, పొటాషియం రక్త ప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడతాయి. మలబద్ధకంతో బాధపడేవారికి ఉదయం అరటిపండ్లు తినడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

జిమ్కు వెళ్లే ముందు లేదా వ్యాయామం చేసే ముందు 1 లేదా 2 అరటిపండ్లు తినడం మంచిది. అరటిపండ్లలోని కార్బోహైడ్రేట్లు వ్యాయామానికి అవసరమైన శక్తిని అందిస్తాయి. అలాగే పొటాషియం కండరాల తిమ్మిరిని నివారిస్తుంది. ఇది కండరాలను కూడా బలపరుస్తుంది.

భోజనం తర్వాత అరటిపండ్లు తినడం వల్ల జీర్ణక్రియ వేగవంతం అవుతుంది. అరటిపండ్లలోని ఫైబర్ ఆహారం జీర్ణం కావడానికి దోహదపడుతుంది. ఇది పేగు ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. శరీరం నుంచి విషాన్ని బయటకు పంపడంలో కూడా సహాయపడుతుంది.

సాయంత్రం 4 నుంచి 6 గంటల మధ్య ఆకలిగా అనిపించినప్పుడు జంక్ ఫుడ్ కు బదులుగా అరటిపండ్లు తినడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇది స్నాక్స్ తినే అలవాటును వదిలించుకోవడానికి సహాయపడుతుంది. ఇది శరీరానికి అవసరమైన పోషణను కూడా అందిస్తుంది.