
బొప్పాయిలో పాపైన్ అనే ప్రత్యేక ఎంజైమ్ ఉంటుంది. ఇది మనం తీసుకున్న ఆహారంలోని ప్రోటీన్లను విచ్ఛిన్నం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. భోజనం తర్వాత బొప్పాయి తినడం వల్ల తిన్న ఆహారం త్వరగా జీర్ణమవుతుంది.

157 గ్రాముల చిన్న బొప్పాయిలో సుమారు 2.67 గ్రాముల ఫైబర్ ఉంటుంది. ఇది మలబద్ధకం, ఉబ్బరం వంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. తేలికపాటి అజీర్ణం, క్రమం లేని ప్రేగు కదలికలతో బాధపడేవారికి బొప్పాయి సురక్షితమైన ఎంపిక.

కివి పండులో ఆక్టినిడిన్ అనే ఎంజైమ్ పుష్కలంగా ఉంటుంది. ఇది బొప్పాయి కంటే కూడా వేగంగా ప్రోటీన్లను విచ్ఛిన్నం చేయగలదని పరిశోధనలు చెబుతున్నాయి. మలబద్ధకం నుండి ఉపశమనం పొందడంలో, మానసిక స్థితిని మెరుగుపరచడంలో కివి పండు మహిళలకు ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఫైబర్ మాత్రమే కాకుండా యాంటీఆక్సిడెంట్లు, విటమిన్-K అధికంగా ఉంటాయి.

రెండు పండ్లు మలబద్ధకానికి మంచివే అయినప్పటికీ, కొన్ని పరిమితులు ఉన్నాయి. కివి పండులో అసిడిటీ పెరిగే అవకాశం ఉన్నందున, అందరికీ ఇది సరిపడకపోవచ్చు. అలాంటి వారు తక్కువ పరిమాణంలో తీసుకోవాలి.

ఏది బెస్ట్..?: ప్రతిరోజూ తినడానికి బొప్పాయి అత్యుత్తమమైనదిగా నిపుణులు చెబుతున్నారు. ఇది అన్ని కాలాల్లో అందుబాటులో ఉండటమే కాకుండా జీర్ణకోశాన్ని ప్రశాంతంగా ఉంచుతుంది. మీ సమస్య తీవ్రతను బట్టి ఈ పండ్లను ఎంచుకోవచ్చు. తీవ్రమైన ప్రోటీన్ అజీర్ణం ఉంటే కివిని, సాధారణ జీర్ణ ప్రక్రియ మెరుగుపడాలంటే బొప్పాయిని మీ ఆహారంలో భాగం చేసుకోండి.