
జీడిపప్పు, మసాలాలు, ఉడికించిన టమోటాలు మరియు వేయించిన ఉల్లిపాయల పేస్ట్తో చిక్కటి, పూసపూస లాంటి గ్రేవీతో ఈ కూర తయారవుతుంది. రోటీ, చపాతీ, పులావ్ లేదా వేడి వేడి అన్నంలోకి ఈ మటన్ కర్రీ అద్భుతమైన కాంబినేషన్గా నిలుస్తుంది.

ఈ ముఘలాయ్ మటన్ కర్రీ తయారీకి ముందుగా ఒక కిలో లేత మటన్ను శుభ్రంగా కడిగి నీళ్లు వడకట్టుకోవాలి. అందులో ఒక టేబుల్ స్పూన్ ఉప్పు, 3 టేబుల్ స్పూన్ల కారం, పావు స్పూన్ పసుపు, అర స్పూన్ జీలకర్ర పొడి, 3 స్పూన్ల ధనియాల పొడి, 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ మరియు దంచిన పచ్చిమిర్చి పేస్ట్ వేసి ముక్కలకు బాగా పట్టించి అరగంట నానబెట్టాలి.

కుక్కర్లో 150 ml నూనె వేసి 3 ఉల్లిపాయల తరుగును గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి పక్కన తీయాలి. అదే నూనెలో తోక మిరియాలు, బిర్యానీ ఆకు, దాల్చినచెక్క, నల్ల యాలుక వేసి మ్యారినేట్ చేసిన మటన్ వేసి 5-6 నిమిషాలు వేయించాలి.

మటన్లో నీళ్లు ఆవిరయ్యే లోపు జార్లో జీడిపప్పు, యాలకులు, లవంగాలు, అనాస పువ్వు, జాపత్రి, జాజికాయ, ఎండిన గులాబీ రేకులు వేసి పొడి చేసి, అందులోనే ఉడికించిన రెండు టమోటాలు వేసి మెత్తగా రుబ్బుకోవాలి. వేయించిన ఉల్లిపాయలను కూడా సపరేట్గా పేస్ట్ చేసుకోవాలి.

మటన్లో నీరు ఆవిరయ్యాక జీడిపప్పు-టమోటా పేస్ట్ వేసి 5 నిమిషాలు మగ్గనివ్వాలి. ఆ తర్వాత టేబుల్ స్పూన్ గేదె నెయ్యి, రుబ్బిన ఫ్రైడ్ ఆనియన్ పేస్ట్ వేసి బాగా కలపాలి. సరిపడా వేడి నీళ్లు పోసి, ఉప్పు కారాలు చెక్ చేసుకుని కుక్కర్ మూతపెట్టి లో ఫ్లేమ్పై 3 విజిల్స్ రానివ్వాలి. విజిల్స్ వచ్చాక ఆవిరి పోయాక మూత తీస్తే నూనె తేలి, పూసపూసగా ఉండే గ్రేవీతో మెత్తటి జ్యూసీ ముఘలాయ్ మటన్ కర్రీ సిద్ధమవుతుంది.