
ఏలూరు: కాలం మారుతుంది. రోహిణి కార్తె నుంచి మృగశిర మాసంలోకి ప్రవేశించాం. కార్తె మారుతున్న సమయంలో మనం తీసుకునే ఆహారం మారాలని చెబుతున్నారు నిపుణులు. వర్షాలు కురుస్తూ, చల్లని వాతావరణం ఏర్పడే సమయంలో ప్రభలే వివిధ రకాల వ్యాధుల నుంచి తప్పించుకోవాలంటే శరీరానికి పోషకవిలువలతో కూడిన ఆహారం అందించాలని చెబుతున్నారు.

అందుకే ఈ సమయంలో చాలా మంది చేపలు తింటారు. ఇక శాకాహారులు అయితే బెల్లం, ఇంగువ కలిపి తీసుకోవడం వంటిది చేస్తుంటారు. ఈరోజు ప్రతి ఒక్కరూ చేపల కర్రీ వండుకొని తింటారు. ఎందుకంటే? చేపలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. వాతావరణం మారే సమయంలో వచ్చే వైరల్ ఇన్ఫెక్షన్స్ నుంచి కాపాడతాయి.

అంతే కాకుండా చేపలలో విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్, ఓమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ బి12 వంటివి ఎక్కువగా ఉండటం వలన చేపలు తినడం ఆరోగ్యానికి చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. అందుకే ప్రతి ఒక్కరూ తమ ఇంటిలో చేపల కర్రీ వండుకుంటారు. అయితే ఇంట్లో చేపల కూర వండుకోలేని వారికి అదిరిపోయే న్యూస్ అందింది. అది ఏమిటంటే?

పశ్చిమగోదావరిజిల్లా లోని జై భారత్ క్షీరా రామ ఆక్వా రైతుసంఘం ఆధ్వర్యంలో మంచి ఆక్వా విందు ఏర్పాటు చేసారు. పాలకొల్లు, నర్సాపురం, ఆచంట నియోజక వర్గాల్లో గోంగూర రొయ్యలు, చేపల పులుసు తో పేదలకోసం విందు ఏర్పాటుచేశారు రైతులు.

ఈ విందులో రొయ్యలు గుడ్డు, గోంగూర రొయ్యలు, ఘుమ ఘుమ లాడే చేపల పులుసు ఉండనున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా లో ఈ ఐటమ్స్ తో పేదలకు భోజనం ఏర్పాటుచేశారు. తెలంగాణ లో చేప పంపిణీ ప్రారంభం కాబోతుంటే ఏపీ లో చేపలు, రొయ్యల తో ఈ విందు భోజనాలు ఏర్పాటు చేయటం చర్చనీయాంశ అయింది.