
ఉపాధి హామీ కూలీలకు కేంద్ర ప్రభుత్వం బిగ్ షాకిచ్చింది. జీతం చెల్లింపులపై కీలక నిర్ణయం తీసుకుంది. కొంతమంది కూలీలకు ప్రైవేట్ బ్యాంకులు, గ్రామీణ బ్యాంకుల్లో ఇప్పటివరకు వేతనం పడుతూ వస్తోంది. ఇక నుంచి అలాంటి బ్యాంక్ అకౌంట్లకు ఉపాధి హామీ నిధుల జారీని ప్రభుత్వం నిలిపివేయాలని నిర్ణయించింది. దీంతో కూలీలకు చిక్కులు ఎదురయ్యే అవకాశముంది.

ఇక నుంచి కేవలం జాతీయ బ్యాంకులు, పోస్టాఫీసు అకౌంట్లలో మాత్రమే ఉపాధి హామీ నిధులు జమ చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ప్రైవేట్, గ్రామీణ బ్యాంకుల అకౌంట్లలో వేతనం పొందుతున్న వారు వెంటనే జాతీయ, పోస్టాఫీస్ బ్యాంకుల్లో అకౌంట్ ఓపెన్ చేయాలని సూచించింది. లేకపోతే వేతనం చెల్లింపుల్లో ఇబ్బందులు ఎదుర్కుంటారని సూచించింది.

కేంద్ర ప్రభుత్వం ఇటీవల మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకంలో మార్పులు చేసింది. ఈ పథకం పేరును వీబీజీ రామ్జీగా మారుస్తూ పార్లమెంట్లో బిల్లుును ఆమోదించింది. ఈ క్రమంలో వేతనం చెల్లింపు వ్యవస్థలో కూడా మార్పులు చేసింది. పారదర్శకత తీసుకొచ్చేందుకు ప్రైవేట్ బ్యాంకు అకౌంట్లతో నిధులు జమ చేయకూడదని నిర్ణయించింది.

అయితే ఈ నిర్ణయంపై ఉపాధి హామీ కూలీలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. పాత విధానంనే అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. జాతీయ బ్యాంకుల్లో అకౌంట్ ఓపెన్ చేయాలంటే మండల కేంద్రాలకు వెళ్లాల్సి ఉంటుందని, అలాగే డబ్బులు విత్ డ్రా చేసుకోవాలన్నా దూరం వెళ్లాల్సి ఉంటుందని వాపోతున్నారు.

ప్రయాణ ఖర్చు అవ్వడంతో పాటు సమయం వృథా అవుతుందని ఉపాధి హామీ కూలీలు చెబుతున్నారు. తమకు ఆర్ధిక భారం పెరిగే అవకాశముంటుందని, ప్రభుత్వం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరతున్నారు. కొత్త అకౌంట్లు ఓపెన్ చేయడం తమకు భారంగా మారుతుందని అంటున్నారు.