వర్షాకాలంలో సైతం ఎండలతో అల్లాడుతున్న తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వాతావరణశాఖ శుభవార్త చెప్పింది. రానున్న మూడు రోజులు అంటే సెప్టెంబర్ 3 నుంచి 5 వరకు రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది.
వాన చినుకుల కోసం ఎదురుచూస్తున్న రైతులకు ఈ వార్త ఎంతో ఉపశమనాన్ని కలగజేయనుంది. మూడు రోజులపాటు ఉత్తర, దక్షిణ జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ సెప్టెంబరు 1న తెలిపింది. ఈ క్రమంలో 20 జిల్లాలకు ఎల్లో అలర్ట్ హెచ్చరికలు జారీచేసింది.
ఇక సెప్టెంబరు 2న కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. ‘ఈశాన్య బంగాళాఖాతం పరిసరాల్లో ఆవర్తనం కేంద్రీకృతమై ఉంది. దక్షిణ ఆంధ్ర తీరం వరకు ద్రోణి విస్తరించి ఉంది. ఉత్తర బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో 3న మరో ఆవర్తనం ఏర్పడే అవకాశాలున్నాయని వాతావరణశాఖ తెలిపింది.
వీటి ప్రభావంతో భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హైదరాబాద్ సంచాలకురాలు కె.నాగరత్న తెలిపారు. హైదరాబాద్ పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో శని, ఆదివారాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయన్నారు. ఉదయం వేళ పొగమంచు కూడా కురిసే అవకాశం ఉందన్నారు. తెలిపారు.
రానున్న 3 రోజుల్లో ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది.