
వేసవి కాలం వచ్చిందంటే చాలు.. చాలామంది నార్మల్ వాటర్ కంటే ఫ్రిజ్లో పెట్టిన ఐస్ కోల్డ్ వాటర్ తాగడానికే ఎక్కువ మొగ్గు చూపుతారు. బయట ఎండలో తిరిగి రాగానే గటగటా చల్లటి నీటిని తాగితే వచ్చే తృప్తి వేరుగా ఉంటుంది. కానీ, ఈ అలవాటు మీ ఆరోగ్యానికి, ముఖ్యంగా మీ పొట్టకు ఎంతటి హాని చేస్తుందో తెలుసా? వైద్య నిపుణుల ప్రకారం, ఫ్రిజ్ నీటిని నిరంతరం తాగడం వల్ల జీర్ణవ్యవస్థ పూర్తిగా దెబ్బతింటుంది.

జీర్ణక్రియపై తీవ్ర ప్రభావం: మన శరీరం సక్రమంగా పనిచేయడానికి నిర్దిష్టమైన అంతర్గత ఉష్ణోగ్రత (Body temperature) అవసరం. మనం తిన్న ఆహారం జీర్ణం కావడానికి పొట్టలో జఠరాగ్ని (జీర్ణ రసాలు) ఉత్పత్తి అవుతుంది. అయితే, మనం ఐస్ వాటర్ తాగిన వెంటనే ఆ చల్లదనం వల్ల జీర్ణ రసాల ప్రభావం తగ్గిపోతుంది. రక్తనాళాలు సంకోచించడం వల్ల జీర్ణవ్యవస్థకు రక్తప్రసరణ మందగిస్తుంది. ఫలితంగా ఆహారం సరిగ్గా అరగక కడుపులో గ్యాస్, ఎసిడిటీ ఏర్పడతాయి.

మలబద్ధకం, కొవ్వు పేరుకుపోవడం: మనం తిన్న ఆహారంలో ఉండే నూనెలు, కొవ్వు పదార్థాలు చల్లటి నీరు తగలగానే గడ్డకడతాయి. దీనివల్ల ప్రేగుల లోపలి గోడలు గట్టిపడి, మల విసర్జన కష్టంగా మారుతుంది. ఇది దీర్ఘకాలిక మలబద్ధకం (Constipation) సమస్యకు దారితీస్తుంది. అంతేకాకుండా, చల్లటి నీరు శరీరంలోని కొవ్వును కరగనివ్వకుండా చేయడం వల్ల బరువు పెరిగే అవకాశాలు ఎక్కువ.

గుండె వేగాన్ని తగ్గిస్తుంది: మన మెదడును, పొట్టను అనుసంధానించే అత్యంత ముఖ్యమైన నరం వ్యాగస్ నర్వ్ (Vagus Nerve). అతిగా చల్లబరిచిన నీటిని తాగినప్పుడు ఈ నరం తీవ్రమైన ఒత్తిడికి లోనవుతుంది. దీనివల్ల గుండె కొట్టుకునే వేగం అకస్మాత్తుగా తగ్గిపోయే ప్రమాదం ఉందని పరిశోధనల్లో తేలింది. దీనితో పాటు గొంతు నొప్పి, టాన్సిల్స్, జలుబు వంటి శ్వాసకోస సమస్యలు కూడా వస్తాయి.

నిపుణుల సూచన మేరకు.. దాహం తీర్చుకోవడానికి ఫ్రిజ్ నీటికి బదులుగా మట్టి కుండలో ఉంచిన నీటిని (Clay pot water) తాగడం అత్యుత్తమం. కుండ నీరు సహజ సిద్ధంగా చల్లబడటమే కాకుండా, శరీరానికి అవసరమైన ఖనిజాలను అందించి ఆరోగ్యంగా ఉంచుతుంది.