
పచ్చి అరటిపండ్లు: పండిన అరటిపండ్లు పొటాషియం ఇచ్చి నొప్పిని తగ్గిస్తాయి. కానీ పచ్చి అరటిపండ్లలో ఉండే రెసిస్టెంట్ స్టార్చ్ జీర్ణం కావడం చాలా కష్టం. ఈ సమయంలో శరీరంలో ప్రొజెస్టెరాన్ హార్మోన్ వల్ల జీర్ణక్రియ అప్పటికే నెమ్మదిగా ఉంటుంది. పచ్చి అరటిపండ్లు తినడం వల్ల గ్యాస్ట్రిక్, మలబద్ధకం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి. అందుకే తోలుపై నల్లటి లేదా గోధుమ రంగు మచ్చలు ఉన్న బాగా పండిన అరటిపండ్లనే తీసుకోవాలి.

పుచ్చకాయ: పుచ్చకాయలో 90 శాతం నీరు ఉంటుంది. అయితే నెలసరి సమయంలో హార్మోన్ల ప్రభావం వల్ల మహిళల శరీరంలో ఇప్పటికే నీరు ఎక్కువగా నిల్వ ఉంటుంది. ఈ సమయంలో పుచ్చకాయ ఎక్కువగా తింటే కడుపు బాగా ఉబ్బినట్లు అనిపించడమే కాకుండా, కాళ్లు, చేతులు బరువుగా అనిపిస్తాయి. ఉబ్బరం సమస్య ఉన్నవారు దీనికి దూరంగా ఉండటం మేలు.

పైనాపిల్: పైనాపిల్లో బ్రోమెలైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది రక్తాన్ని పల్చగా చేసే గుణాన్ని కలిగి ఉంటుంది. నెలసరి సమయంలో పైనాపిల్ ఎక్కువగా తీసుకోవడం వల్ల గర్భాశయ కండరాలు ఎక్కువగా సంకోచించి, రక్తస్రావం పెరగవచ్చు. ఇది నొప్పులను మరింత తీవ్రతరం చేస్తుంది.

సిట్రస్ పండ్లు: నారింజ, నిమ్మ వంటి సిట్రస్ పండ్లలో విటమిన్ సి ఉన్నప్పటికీ, వాటిలోని అధిక ఆమ్ల గుణాలు నెలసరి సమయంలో కడుపులో మంటను కలిగిస్తాయి. ఈ సమయంలో ఈస్ట్రోజన్ స్థాయిలు తగ్గడం వల్ల కడుపు సున్నితంగా మారుతుంది. దీనివల్ల ఎసిడిటీ, గుండెల్లో మంట, వికారం వంటి సమస్యలు తలెత్తుతాయి.

చక్కెర పూసిన ఎండు ఫలాలు: ప్యాకెట్లలో లభించే చక్కెర పూసిన ఖర్జూరాలు, ఆప్రికాట్లు ఆరోగ్యకరమైన స్నాక్స్ కావు. వీటిలో ఉండే కృత్రిమ చక్కెర ఇన్సులిన్ స్థాయిలను పెంచి శరీరంలో వాపుకు కారణమవుతుంది. ఇది శారీరక నొప్పినే కాకుండా మానసిక అలజడిని కూడా పెంచుతుంది.