Hardik Pandya - Natasa Stankovic: క్రికెట్ ప్రపంచంలో చాలా ఆసక్తికరమైన ప్రేమకథలు ఎన్నో చూశాం. అయితే, ఇందులో కొంతమంది మాత్రం, వారి ప్రయాణాన్ని మధ్యలోనే ముగించాల్సి వచ్చింది. ఇప్పుడు ఈ జాబితాలో హార్దిక్ పాండ్యా కూడా చేరాడు. హార్దిక్, నటాషాల 4 ఏళ్ల బంధం తెగిపోయింది. వారిద్దరూ తమ ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేయడం ద్వారా పుకార్లను ధృవీకరించారు. హార్దిక్ మాత్రమే కాదు, టీమ్ ఇండియాకు చెందిన మరో ముగ్గురు క్రికెటర్లు కూడా ఈ లిస్టులో ఉన్నారు.
హార్దిక్ పాండ్యా: గత 6 నెలలుగా హార్దిక్, నటాషా మధ్య సఖ్యత లేదు. ఇంతకు ముందు ఐపీఎల్ 2024లో ఒక్క మ్యాచ్లో కూడా నటాషా స్టేడియంలో కనిపించలేదు. ఆ తర్వాత, టీ20 ప్రపంచ కప్ గెలిచిన తర్వాత, హార్దిక్ ప్రపంచ వ్యాప్తంగా అభినందనలు అందుకున్నాడు. కానీ, నటాషా ఏమీ పోస్ట్ చేయలేదు. దీంతో వీరి వివాహబంధంలో చిచ్చు మొదలైందనే వార్తలు ఊపందుకున్నాయి. ఎట్టకేలకు ఈ వార్తలు నిజమేనని తేల్చేశారు.
శిఖర్ ధావన్: టీమిండియా వెటరన్ ప్లేయర్ శిఖర్ ధావన్ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. 2012లో ధావన్ అయేషాను వివాహం చేసుకున్నాడు. ఆమెకు అప్పటికే ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఆ తర్వాత శిఖర్ ధావన్ జోరావర్కు తండ్రి అయ్యాడు. ధావన్, అయేషా 2021లో విడిపోయారు.
దినేష్ కార్తీక్: టీమిండియా స్టార్ స్టార్ దినేష్ కార్తీక్ కూడా ఈ దశను దాటాడు. దినేష్ కార్తీక్ విషయంలో ప్రేమ, పెళ్లి, ఆపై నమ్మకద్రోహం కూడా చోటు చేసుకుంది. తన చిన్ననాటి స్నేహితురాలు నికితా వంజారాను 2007లో పెళ్లాడాడు. అయితే ఆ తర్వాత నికితా కార్తీక్ బెస్ట్ ఫ్రెండ్ మురళీ విజయ్తో సంబంధాన్ని ఏర్పరచుకుంది. దీంతో కార్తీక్, నికితాలు 2012లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత స్క్వాష్ క్రీడాకారిణి దీపికా పల్లికల్ను దినేష్ కార్తీక్ వివాహం చేసుకున్నాడు.
మహ్మద్ షమీ: టీం ఇండియా స్టార్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ వ్యక్తిగత జీవితంలో కూడా బ్యాడ్ ఫేజ్ను ఎదుర్కొన్నాడు. 2014లో ఛీర్లీడర్ హసీన్ జహాన్ను షమీ పెళ్లాడాడు. వారికి ఒక కుమార్తె కూడా ఉంది. కానీ, 2018 సంవత్సరంలో, హసిన్ జహాన్ షమీపై తీవ్రమైన ఆరోపణలు చేసింది. వారి సంబంధం 4 సంవత్సరాల తర్వాత ముగిసింది.
మహ్మద్ అజారుద్దీన్: భారత జట్టు మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ ఏకంగా రెండు సార్లు విడాకులు తీసుకున్నాడు. అతను 1996లో తన మొదటి భార్య నౌరీన్తో విడాకులు తీసుకున్నాడు. ఆ తర్వాత బాలీవుడ్ నటి సంగీతా బిజ్లానీని వివాహం చేసుకున్నాడు. కొన్ని సంవత్సరాల తరువాత సంగీతా బిజ్లానీతో విడాకులు తీసుకున్నాడు. ప్రస్తుతం యూఎస్ఏకు చెందిన షానన్ మేరీతో రిలేషన్షిప్లో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
వినోద్ కాంబ్లీ: భారత క్రికెటర్ వినోద్ కాంబ్లీ తన చిన్ననాటి స్నేహితురాలు నోయెల్లా లూయిస్ను 1998లో వివాహం చేసుకున్నాడు. వివాహ సమయంలో భార్యపై దాడి చేసి చిత్రహింసలకు గురిచేశాడని ఆరోపించారు. ఆ తర్వాత భార్య నుంచి విడాకులు తీసుకున్నాడు.
జావగల్ శ్రీనాథ్: జవగల్ శ్రీనాథ్ భారత ఫాస్ట్ బౌలర్. ప్రస్తుతం, అతను ICCకి మ్యాచ్ రిఫరీగా పనిచేస్తున్నాడు. అతను 1999లో జ్యోస్నను వివాహం చేసుకున్నాడు. కానీ 8 సంవత్సరాల తర్వాత 2007లో విడాకులు తీసుకున్నాడు. ఒక సంవత్సరం తరువాత, అతను జర్నలిస్ట్ మాధవి పాత్రావళిని వివాహం చేసుకున్నాడు.