
చాలా మంది మొక్కజొన్న అంటే ఎక్కువగా స్వీట్ కార్న్ మాత్రమే తెలుసు. వీటినే ఎక్కువగా తింటారు. మరికొంత మంది మొక్కజొన్న గారెలు వంటివి ప్రిపేర్ చేసుకొని తింటారు. కానీ కాస్త కొత్తగా క్రిస్పీ కార్న్ ప్రిపేర్ చేసుకుంటే రుచి చాలా అద్భుతంగా ఉంటుందంట. ఇది మీకే కాకుండా మీ కుటుంబ సభ్యులందరికీ తెగ నచ్చేస్తుంది.

క్రిస్పీ కార్న్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాల్లోకి వెళ్లితే.. మరి లేతవి , మరీ ముదురు కాకుండా నార్మల్గా ఉండే మొక్క జొన్న పొత్తులు రెండు కప్పులు తీసుకోవాలి. శనగ పిండి నాలుగు టేబుల్ స్పూన్స్, రైస్ ఫ్లోర్ మూడు టేబుల్ స్పూన్స్, కారం పొడి, చిటికెడు పసుపు, ఉప్పు, చాట్ మసాలా, నూనె, కొత్తిమీర, మొక్క జొన్న గింజలు ఉడికించడానికి సరిపడ నీరు.

తయారీ విధానంలోకి వెళితే.. ముందుగా మొక్కజొన్న గింజలు తీసుకోవాలి. వాటిని ఒక బౌల్లో వేసి సరిపడ నీళ్లు పోసి, స్టవ్ ఆన్ చేసి, మంటపై పది నిమిషాలు ఉడికించుకోవాలి. మొక్క జొన్న పొత్తులు చాలా త్వరగా ఉడికిపోతాయి. ఇవి ఉడికిన తర్వాత వీటిని మరొక ప్లేట్లోకి తీసుకొని ఇవి పూర్తిగా చల్లారేలా చూసుకోవాలి.

ఇప్పుడు మనం పిండి తయారు చేసుకోవాలి. దీని కోసం శనగ పిండి, రైస్ ఫ్లోర్ , చాట్ మసాలా, కారం పొడి, పసుపు, సరిపడ ఉప్పు, అన్నీ వేసి మంచిగా కలుపుకోవాలి. పిండి కొంచెం పకోడి పిండి టైప్లో కలుపుకోవాలి. తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న మొక్కజొన్న పొత్తులు ఇందులో వేసి మళ్లీ కలుపుకోవాలి.

ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి, పాన్ పెట్టి, అందులో వీటిని వేయించడానికి సరిపడ నూనె వేయాలి. తర్వాత మనం పిండిలో కలిపి పెట్టుకున్న కార్న్ ఆయిల్లో వేస్తూ బంగారు రంగు వచ్చే వరకు మంచిగా వేయించుకోవాలి. ఇవి ఎంత బాగా వేగితే అంతగా రుచి ఉంటాయి. బాగా వేగిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసుకొని, దానిపై కొంచెం కొత్తిమీర, మసాలా చల్లి తింటే రుచి అద్భుతంగా ఉంటుంది.