
బంగ్లాదేశ్తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్లో విరాట్ కోహ్లీ 8 ఫోర్లు కొట్టి ప్రత్యేక రికార్డు జాబితాలో చేరాడు. ఈ మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్లో కోహ్లీ 35 బంతులు ఎదుర్కొని 4 ఫోర్లు, 1 సిక్స్తో 47 పరుగులు చేశాడు. రెండో ఇన్నింగ్స్లో 37 బంతుల్లో 4 ఫోర్లతో 29 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.

ఈ ఎనిమిది ఫోర్లతో విరాట్ కోహ్లీ టెస్టు క్రికెట్లో 1000 ఫోర్లు బాదిన సాధకుల జాబితాలో చేరిపోయాడు. దీంతో ఈ ఘనత సాధించిన 6వ భారత బ్యాట్స్మెన్గా నిలిచాడు. ఇంతకు ముందు సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, వీరేంద్ర సెహ్వాగ్, వీవీఎస్ లక్ష్మణ్, సునీల్ గవాస్కర్ ఈ ఘనత సాధించారు.

ఈ జాబితాలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అగ్రస్థానంలో ఉన్నాడు. టీమిండియా తరపున 200 టెస్టు మ్యాచ్లు ఆడిన సచిన్ 329 ఇన్నింగ్స్ల్లో 2058 ఫోర్లు బాది ప్రపంచ రికార్డు సృష్టించాడు.

115 టెస్టుల్లో 195 ఇన్నింగ్స్లు పూర్తి చేసిన విరాట్ కోహ్లీ మొత్తం 1001 ఫోర్లు కొట్టాడు. దీంతో టెస్టు క్రికెట్ చరిత్రలో 1000 ఫోర్లు బాదిన ప్రపంచ 26వ ఆటగాడిగా నిలిచాడు.

అలాగే, ఈ మ్యాచ్లో మొత్తం 76 పరుగులు చేయడం ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో 27 వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. దీంతో క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా 27 వేల పరుగులు చేసిన బ్యాట్స్మెన్గా నిలిచాడు. గతంలో ఈ రికార్డు సచిన్ టెండూల్కర్ (623) పేరిట ఉండేది. ఇప్పుడు విరాట్ కోహ్లీ కేవలం 594 ఇన్నింగ్స్లలో 27000 పరుగులు సాధించి సరికొత్త చరిత్ర సృష్టించాడు.