
Matthew Hayden: ఆసియా కప్ 2023 కోసం టీమిండియాను ప్రకటించిన తర్వాత ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ మాథ్యూ హేడెన్ కీలక ప్రకటన చేశాడు. నిజానికి, మాథ్యూ హేడెన్ టీమిండియా ఇద్దరు బ్యాట్స్మెన్లను భవిష్యత్ సూపర్స్టార్స్గా అభివర్ణించాడు. 2023 ఆసియా కప్లో భారత జట్టులోకి ప్రవేశించిన శుభ్మన్ గిల్, తిలక్ వర్మ వంటి యువ బ్యాట్స్మెన్లు ఆకట్టుకుంటారని ఆస్ట్రేలియా మాజీ బ్యాట్స్మెన్ మాథ్యూ హేడెన్ ఆశాభావం వ్యక్తం చేశాడు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2023) చివరి సీజన్లో పటిష్ట ప్రదర్శన చేసిన గిల్, వెస్టిండీస్ పర్యటనలో తన ఫాంను నిలబెట్టుకోలేకపోయాడు. అయితే టీ20 సిరీస్లో అరంగేట్రం చేసిన తర్వాత తిలక్ వర్మ తన బ్యాటింగ్తో ఆకట్టుకున్నాడు.

సియట్ క్రికెట్ రేటింగ్ అవార్డుల వేడుక సందర్భంగా మాథ్యూ హేడెన్ మాట్లాడుతూ, 'ఇది ప్రతిభావంతులైన గ్రూప్. ముఖ్యంగా బ్యాటింగ్ పరంగా అద్భుతంగా ఉంది. ఇది భారతదేశాన్ని ట్రోర్నీలో బలంగా తయారుచేస్తుంది' అంటూ ఆశాభావం వ్యక్తం చేశాడు.

'గిల్ తన దేశం తరపున ఇప్పటి వరకు పెద్దగా వన్డే క్రికెట్ ఆడలేదు. తిలక్ వర్మ ఈ ఫార్మాట్లో అరంగేట్రం చేయలేదు. కానీ, అతను ఫలితాలను ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడు' అంటూ చెప్పుకొచ్చాడు.

మాథ్యూ హేడెన్ మాట్లాడుతూ, 'మేం ఇది ఐపీఎల్లో చూశాం. అంతకు ముందు తెలియని ఆటగాళ్ల నుంచి ఇలాంటి బలమైన ప్రదర్శనలు చూశాం. అందుకే భారత క్రికెట్ ప్రస్తుతం మంచి స్థానంలో ఉంది' అని తెలిపాడు.

భారత జట్టు మిడిల్ ఆర్డర్ ఆందోళనపై హేడెన్ మాట్లాడుతూ.. 'భారత్ మిడిలార్డర్ను చూస్తే శ్రేయాస్ అయ్యర్, లోకేష్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ లాంటి ఆటగాళ్లు ఉన్నారు. రోహిత్ శర్మ వీరిని అత్యుత్తమంగా అభివర్ణించాడు' అని ప్రకటించాడు.