శ్రీలంక, పాకిస్థాన్ మధ్య గలే వేదికగా తొలి టెస్ట్ మ్యాచ్ ఆదివారం ప్రారంభమైంది. ఈ మ్యాచ్లో పాక్ ఫాస్ట్ బౌలర్ షాహీన్ ఆప్రిదీ తన 100 టెస్ట్ వికెట్ని తీసుకున్నాడు. అలాగే ప్రస్తుతానికి మొత్తంగా 102 టెస్ట్ వికెట్లను పడగొట్టాడు. అలాగే పాక్ తరఫున ఈ ఘనత సాధించిన 18వ ప్లేయర్గా అవతరించాడు.
టాస్ గెలిచిన శ్రీలంక ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో లంక ఓపెనర్ నిషాన్ మధుశంకను 4 పరుగుల వద్ద అవుట్ చేయడం ద్వారా ఆఫ్రిది తన వికెట్ల సెంచరీని పూర్తి చేసుకున్నాడు. అలాగే దిముత్ కరుణరత్నే(29), కుశాల్ మెండీస్(12)ను కూడా వరుసగా పెవిలియన్ చేర్చడం ద్వారా ఆఫ్రిదీ మొత్తం 102 టెస్టు వికెట్లను పడగొట్టాడు.
ఈ మ్యాచ్కు ముందు, ఆఫ్రిది తన సెంచరీ వికెట్లను పూర్తి చేసేందుకు కేవలం ఒక వికెట్ దూరంలోనే ఉన్నాడు. కానీ ఈ వికెట్ దక్కించుకోవడానికి అతను ఏడాది పాటు వేచి చూడాల్సి వచ్చింది. అదెలా అంటే.. అఫ్రిదీ గతేడాది జులైలో శ్రీలంకతో ఇదే మైదానంలో తన చివరి టెస్టు మ్యాచ్ ఆడాడు. అయితే ఆ మ్యాచ్లో మోకాలి గాయంతో చాలా కాలం క్రికెట్కు దూరమయ్యాడు.
గతేడాది సరిగ్గా ఇదే రోజున అంటే జూలై 16, 2022న ప్రారంభమైన అప్పటి మ్యాచ్లో మహిష్ తీక్షణను 99వ వికెట్గా అవుట్ చేశాడు ఆఫ్రిది. అయితే రెండో ఇన్నింగ్స్లో కేవలం 7 ఓవర్లే వేసి, ఆపై గాయం పాలయ్యాడు. దీంతో అఫ్రిది జాతీయ జట్టు నుంచి సుదీర్ఘ కాలం పాటు తప్పుకోవాల్సి వచ్చింది.
ఈ గాయం కారణంగానే గతేడాది ఆసియా కప్లో కూడా అఫ్రిదీ ఆడలేకపోయాడు. ఆ తర్వాత టీ20 ప్రపంచకప్లో పాకిస్థాన్ తరఫున ఆడినా.. ఫైనల్ మ్యాచ్లో మళ్లీ గాయపడ్డాడు. ఫలితంగా స్వదేశంలోనే ఇంగ్లండ్, న్యూజిలాండ్లతో టెస్టు సిరీస్లు జరిగినా అందులో అతను ఆడలేకపోయాడు.
అనంతరం మోకాలి గాయం నుంచి కోలుకున్న ఆఫ్రిదీ పాకిస్థాన్ సూపర్ లీగ్లో ఆడాడు. అతని నాయకత్వంలోనే లాహోర్ ఖలందర్స్ జట్టు పీఎస్ఎల్ 2023 టైటిల్ను కూడా గెలుచుకుంది. ఆ తర్వాత ఏప్రిల్-మేలో న్యూజిలాండ్తో జరిగిన ODI, T20 సిరీస్ల కోసం ఆఫ్రిదీ జాతీయ జట్టులో చేరాడు.