World Test Championship: మొదటి ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ లో న్యూజిలాండ్ విశ్వ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. డబ్ల్యూటీసీ ఫైనల్ లో భారత్, కివీస్ టీంల మధ్య జరిగిన ఈ మ్యాచ్ లో అద్భుతంగా ఆడి న్యూజిలాండ్ తొలి డబ్ల్యూటీసీ ట్రోఫీని అందుకుంది.
రెండవ డబ్ల్యూటీసీ భారత్, ఇంగ్లాండ్ మధ్య 5 టెస్టు మ్యాచ్ల సిరీస్తో తెరలేవనుంది. 2021-23 మధ్య జరిగే ఈ ఛాంపియన్షిప్ కాస్త భిన్నంగా మొదలుకానుంది. తొలి డబ్ల్యూటీసీలో మాదిరిగా సిరీస్లో మ్యాచ్ల సంఖ్య ఆధారంగా కాకుండా ప్రతి మ్యాచ్కు ఒకే రీతిలో పాయింట్లు కేటాయించనున్నారు.
లీగ్ దశలో అగ్రస్థానంలో ఉన్న రెండు జట్ల మధ్య ఫైనల్ నిర్వహిస్తారు. ఈ కొత్త పాయింట్ల విధానానికి ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆమోదం లభించాల్సి ఉంది.
ఇంతకుముందు సిరీస్కు 120 పాయింట్లు కేటాయించేవారు. రెండు మ్యాచ్ల సిరీస్ అయితే గెలిచిన జట్టుకు మ్యాచ్కు 60 పాయింట్లు, మూడు మ్యాచ్ల సిరీస్ అయితే మ్యాచ్కు 40 పాయింట్లు ఇచ్చేవారు. దీనిపై పలు విమర్శలు వెల్లువెత్తాయి. చివరికి కరోనా కారణంగా అత్యధిక పాయింట్లు సాధించిన రెండు జట్ల మధ్య కాకుండా గెలుపు శాతం ఆధారంగా ఫైనలిస్టును నిర్ణయించారు.
కొత్త విధాంలో ఒక్కో సిరీస్కు 120 పాయింట్లు కాకుండా సిరీస్లో ఎన్ని మ్యాచ్లు ఉన్నా.. ప్రతి మ్యాచ్కు సమాన పాయింట్లుంటాయి. మ్యాచ్ గెలిస్తే 12 పాయింట్లు, టై అయితే 6 పాయింట్లు, డ్రా అయితే 4 పాయింట్లు లభిస్తాయి. గెలిచిన పాయింట్ల శాతం ఆధారంగా జట్లకు ర్యాంకింగ్ కేటాయిస్తారు.