
Digvesh Rathi Notebook Celebration: గత ఐపీఎల్ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) ఆటగాడు అభిషేక్ శర్మ (Abhishek Sharma)తో జరిగిన వాగ్వాదం, ఆపై ఎదుర్కొన్న మ్యాచ్ సస్పెన్షన్ దిగ్వేశ్ రాఠీ (Digvesh Rathi)ని వార్తల్లో నిలిచేలా చేశాయి. వికెట్ తీశాక గాలిలో ఏదో రాస్తున్నట్లు (నోట్బుక్ సిగ్నేచర్) చేసే అతని సంబరాలు బ్యాటర్లను అవమానించడమేనని గతంలో ఫిర్యాదులు అందాయి. అయితే, దీనిపై రాఠీ తాజాగా స్పందిస్తూ.. "నేను ఏ ఆటగాడినీ అవమానించడం లేదు. బ్యాటర్లు సెంచరీ చేశాక హెల్మెట్ను బ్యాట్పై ఉంచి సంబరాలు చేసుకున్నట్లే, నేను కూడా నా వికెట్ను ఎంజాయ్ చేస్తాను. నా సెలబ్రేషన్స్ను ఎవరూ ఆపలేరు" అని ధీమా వ్యక్తం చేశాడు.

ఈ వివాదంపై లఖ్నవూ సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషభ్ పంత్, జట్టు మేనేజ్మెంట్ రాఠీకి కీలక సూచనలు చేసినట్లు తెలుస్తోంది. "నువ్వు నీ స్పెషల్ సెలబ్రేషన్స్ చేసుకో, కానీ అది ఐసీసీ నిబంధనల అతిక్రమణకు దారితీసి మళ్లీ నిషేధం పడకుండా చూసుకో" అని వారు హెచ్చరించినట్లు రాఠీ తెలిపాడు. మైదానంలో దూకుడు ప్రదర్శించడం మంచిదే అయినా, అది జట్టు ప్రయోజనాలకు గండి కొట్టకూడదనేది మేనేజ్మెంట్ ఉద్దేశం.

దిగ్వేశ్ రాఠీ ఇప్పటికే నిబంధనల ఉల్లంఘన కారణంగా భారీ మూల్యాన్ని చెల్లించుకున్నాడు. గతంలో ఒకే సీజన్లో మూడుసార్లు నిబంధనలు అతిక్రమించినందుకు తొలుత 25 శాతం, ఆ తర్వాత రెండుసార్లు 50 శాతం చొప్పున మ్యాచ్ ఫీజులో కోత విధించారు. ఐపీఎల్ నిబంధనల ప్రకారం రాఠీ ఖాతాలో ప్రస్తుతం ఒక డీమెరిట్ పాయింట్ ఉంది.

ఐసీసీ నియమావళి ప్రకారం, 24 నెలల కాలంలో ఒక ఆటగాడి ఖాతాలో 4 డీమెరిట్ పాయింట్లు చేరితే అది ఒక సస్పెన్షన్ పాయింట్తో సమానం. దీనివల్ల ఒక మ్యాచ్ నిషేధం విధిస్తారు. ఒకవేళ 8 డీమెరిట్ పాయింట్లు వస్తే రెండు మ్యాచ్లు, 11 పాయింట్లు దాటితే మూడు మ్యాచ్ల వరకు నిషేధం పడే అవకాశం ఉంది. రాఠీ తన దూకుడును అదుపులో పెట్టుకోకపోతే భవిష్యత్తులో మరిన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు.

కేవలం ఐపీఎల్లోనే కాకుండా, దేశవాళీ క్రికెట్లో కూడా రాఠీ తన 'నోట్బుక్' సెలబ్రేషన్స్ను కొనసాగించి వివాదాలకు కేంద్రబిందువు అయ్యాడు. అంపైర్లు దీనిని బ్యాటర్లను రెచ్చగొట్టే చర్యగా పరిగణిస్తున్నప్పటికీ, రాఠీ మాత్రం ఇది తన సిగ్నేచర్ స్టైల్ అని సమర్థించుకుంటున్నాడు. ఈ సీజన్లో అంపైర్లు రాఠీ ప్రవర్తనను ఎంతవరకు అనుమతిస్తారో చూడాలి.