
ప్రతిష్ఠాత్మక కామన్వెల్త్ గేమ్స్లో స్వర్ణం సాధించడమే తమ ఏకైక లక్ష్యమని భారత మహిళా క్రికెట్ జట్టు స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన తెలిపింది. కామన్వెల్త్ గేమ్స్ 2022కు బయలుదేరే ముందు మాట్లాడిన ఆమె పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. స్వర్ణం సాధించడమే తమ జట్టు లక్ష్యమని, ఈవిషయంలో నీరజ్ చోప్రాను స్ఫూర్తిగా తీసుకుంటామని స్మృతి పేర్కొంది.

జట్టులోని అమ్మాయిలందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారని, స్వర్ణం సాధించడం కోసం ఉవ్విళ్లూరుతున్నారని టీమిండియా ఓపెనర్ తెలిపింది. కామన్వెల్త్ క్రీడల్లో తమ జట్టు పటిష్ఠంగా ఉందని స్మృతి తెలిపింది.

కాగా ఇటీవల శ్రీలంకతో జరిగిన వన్డే, టీ20 సిరీస్లలో భారత జట్టు అద్భుత ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే. ఇదే ఉత్సాహంతో బర్మింగ్ హామ్ ఫ్లైట్ ఎక్కింది.

నీరజ్ చోప్రాను తన టీమ్ స్ఫూర్తిగా తీసుకుంటోందని మంధాన తెలిపింది. కాగా నీరజ్ చోప్రా ఒలింపిక్స్లో జావెలిన్ త్రోలో స్వర్ణం సాధించి చరిత్ర సృష్టించాడు. టీమ్ ఇండియాలోని ప్రతి క్రికెటర్ ఆ క్షణాన్ని గుర్తుంచుకుని బర్మింగ్హామ్లో చరిత్ర సృష్టిస్తామంది స్మృతి.

కాగా కామన్వెల్త్ గేమ్స్లో భారత జట్టు జూలై 29న ఆస్ట్రేలియాతో తలపడుతుంది. దీని తర్వాత జులై 31న పాకిస్థాన్తో ఢీకొననుంది. ఆగస్టు 3న టీమ్ ఇండియా, బార్బడోస్ మహిళల జట్లు తలపడనున్నాయి.