
టీమిండియా సీనియర్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ రీఎంట్రీ ఆశలకు మరోసారి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గాయంతో వైదొలిగిన జస్ప్రీత్ బుమ్రా స్థానంలో చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ నేతృత్వంలోని ఎంపిక కమిటీ యంగ్ పేసర్ ఆకిబ్ నబీని ఎంపిక చేసింది. ఈ సంచలన నిర్ణయంతో షమీ టెస్టు కెరీర్పై బీసీసీఐ ఒక స్పష్టమైన సంకేతాన్ని పంపించింది.

శ్రీలంకతో జరగబోయే రెండు టెస్టుల సిరీస్కు స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా మోకాలి గాయం కారణంగా దూరం కావాల్సి వచ్చింది. బుమ్రా లేకపోవడం జట్టుకు పెద్ద లోటే అయినప్పటికీ, అతడి స్థానంలో ఎవరిని తీసుకుంటారనేది తీవ్ర ఆసక్తికరంగా మారింది. అందరూ అనుభవజ్ఞుడైన మహమ్మద్ షమీ వైపు మొగ్గు చూపుతారని భావించారు. అయితే బీసీసీఐ సెలెక్టర్లు మాత్రం జమ్మూ కాశ్మీర్కు చెందిన అన్క్యాప్డ్ ఫాస్ట్ బౌలర్ ఆకిబ్ నబీకి తొలిసారి జాతీయ జట్టు నుంచి పిలుపునిచ్చారు. డొమెస్టిక్ క్రికెట్లో వరుసగా వికెట్లు పడగొడుతున్న నబీకి ప్రాధాన్యం ఇవ్వడం సీనియర్లకు పెద్ద షాక్గా మారింది.

షామీ విషయంలో బీసీసీఐ కఠిన వైఖరి..: 2023 తర్వాత భారత టెస్టు జట్టులో స్థానం దక్కించుకోలేకపోయిన మహమ్మద్ షమీకి ఈ ఎంపిక తీవ్ర నిరాశ కలిగించింది. గత ఏడాది కాలంగా రంజీ ట్రోఫీలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచినప్పటికీ అతడిని సెలెక్టర్లు పక్కన పెట్టడం గమనార్హం. చివరి ఏడు రంజీ మ్యాచ్లలో షమీ ఏకంగా 37 వికెట్లు పడగొట్టి తన ఫామ్ను నిరూపించుకున్నాడు. కానీ అతనికి పూర్తి స్థాయి టెస్టు మ్యాచ్లు ఆడే ఫిట్నెస్ లేదని, సుదీర్ఘ ఓవర్లు బౌలింగ్ చేసే శారీరక దారుఢ్యం ఇంకా సాధించాల్సి ఉందనే నెపంతో సెలెక్షన్ కమిటీ పక్కన బెట్టింది.

నబీ రికార్డులే తిరుగులేని రుజువు..: మరోవైపు ఆకిబ్ నబీ గత రెండు రంజీ సీజన్లలో అద్భుతమైన గణాంకాలు నమోదు చేశాడు. గడిచిన రంజీ సీజన్లో 12.56 సగటుతో ఏకంగా 60 వికెట్లు తీసి జమ్మూ కాశ్మీర్ మొదటిసారి టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. అంతేకాకుండా ఇటీవలే ఇండియా-ఎ తరుఫున లంక పర్యటనలోనూ రాణించాడు. కేవలం పేర్ల ఆధారంగా కాకుండా దేశవాళీ క్రికెట్లో అత్యుత్తమ ప్రదర్శన చేసే వారికి మాత్రమే భారత జట్టులో చోటు ఉంటుందని అగార్కర్ ఈ ఎంపిక ద్వారా చాటిచెప్పారు.

షమీ ముందున్న ఏకైక మార్గం ఇదే..: అగార్కర్ పంపిన సందేశంతో షమీ టెస్టు కెరీర్ ముగిసిపోయిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. యువ పేసర్లు దేశవాళీలో కొండంత ప్రదర్శనలతో దూసుకొస్తున్న వేళ, సీనియర్ అయినంత మాత్రాన జట్టులో చోటు దక్కదని స్పష్టమైంది. షమీ మళ్లీ తెల్లటి జెర్సీ ధరించాలంటే రాబోయే దులీప్ ట్రోఫీ వంటి కీలక టోర్నీల్లో యువ ఆటగాళ్లను మించి వికెట్లు పడగొట్టడంతో పాటు, వంద శాతం ఫిట్నెస్ను మైదానంలో నిరూపించుకోవాల్సి ఉంటుంది.