
మరికొద్దిరోజుల్లో టీ20 వరల్డ్కప్ సమరం ప్రారంభం కానుంది. ఈలోపే ప్రతీ జట్టు తమ మేటి ఆటగాళ్లను.. ఆ టోర్నీకి తగ్గట్టు తీర్చిదిద్దుతోంది. ఇటీవల జరిగిన ఆస్ట్రేలియా, వెస్టిండీస్ టీ20 సిరీస్లో అది కొట్టొచ్చినట్టు కనబడుతోంది. మూడు టీ20ల ఈ సిరీస్లో ఏకంగా 1266 పరుగులు నమోదు కావడం గమనార్హం. మరి ఆ లెక్కలేంటో చూసేద్దామా..

మూడు టీ20 మ్యాచ్లలో ఏకంగా ఐదుసార్లు 200కిపైగా స్కోర్లు నమోదయ్యాయి. అంతేకాదు అడిలైడ్ వేదికగా జరిగిన రెండో టీ20లో అయితే ఆస్ట్రేలియా ఏకంగా 241 పరుగులు చేసి.. టీ20ల్లోనే మరో అత్యధిక టీం టోటల్ను నమోదు చేసింది.

ఈ మూడు టీ20ల్లో ఒక సెంచరీ, 6 అర్ధ సెంచరీలు నమోదయ్యాయి. రెండో టీ20లో మ్యాక్స్వెల్ 50 బంతుల్లో మెరుపు సెంచరీ నమోదు చేయగా.. డేవిడ్ వార్నర్ ఆడిన 3 మ్యాచ్ల్లో 2 అర్ధ శతకాలు, రస్సెల్(1), పావెల్(1), రూథర్ఫోర్డ్(1), కింగ్(1) చెరో అర్ధ శతకం బాదేశారు.

టీ20 ప్రపంచకప్కు ముందుగా వెస్టిండీస్ బ్యాటర్లు ఈ మాదిరిగా బ్యాటింగ్లో ఊచకోత కోయడంతో.. మరోసారి మాజీ టీ20 ఛాంపియన్స్ ఇంకో ట్రోఫీపై కన్నేశారని చెప్పకనే చెబుతున్నారు. అటు వన్డే వరల్డ్ కప్ ఛాంపియన్స్ ఆస్ట్రేలియా కూడా ప్రతీ జట్టుకు గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్దమైంది.

మొత్తంగా ఈ మూడు టీ20ల సిరీస్లో 117 ఫోర్లు, 65 సిక్సర్లతో 1266 పరుగులు నమోదయ్యాయి. ఇప్పటివరకు జరిగిన త్రీ మ్యాచ్ టీ20లో ఇదే హయ్యస్ట్. అంతకన్నా ముందు దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ మధ్య 1213 పరుగులు నమోదు కాగా, సౌతాఫ్రికా, ఇంగ్లాండ్ మధ్య 1207 పరుగులు.. భారత్, వెస్టిండీస్ మధ్య 1172 పరుగులు.. ఆఫ్ఘనిస్తాన్, ఐర్లాండ్ మధ్య 1128 పరుగులు వచ్చాయి. ఈ ఐదు ఎన్కౌంటర్లలో మూడింటిలో వెస్టిండీస్ ప్రత్యర్ధి జట్టుగా ఉండటం గమనార్హం.