
ప్రస్తుతం మనం ఉండేది డిజిటల్ యుగం. ఏదైనా ఒక్క స్మార్ట్ ఫోన్లోనే ఇట్టే చేసేయొచ్చు. అరచేతిలో ప్రపంచం అంటే ఇదేనేమో బహుషా. ఈ క్రమంలోనే దేశంలో యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (UPI) సేవలు విస్తారంగా పెరిగాయి.

మెట్రో నగరాల మొదలు చిన్న గ్రామీణ ప్రాంతాలకూ ప్రతి చోట పేటీఎం కరో అనే వాయిస్ వినిపిస్తూనే ఉంది. చిన్న చిన్న దుకాణాలు సైతం డిజిటల్ లావాదేవీల వైపుకు మొగ్గు చూపుతున్నాయి. అయితే ఇదే సమయంలో నగదు వినియోగం కూడా ఎక్కడా తగ్గడంలేదంటోంది తాజాగా నిర్వహించిన ఒక సర్వే.

సీఎంఎస్ సంస్థ వెలువరించిన కన్జంప్షన్ రిపోర్ట్ ప్రకారం దేశంలో ఎంత ఆన్లైన్ లావాదేవీలు అందుబాటులోకి వచ్చినా నగదు లావాదేవీలు నేటికీ కొనసాగుతూనే ఉన్నట్లు స్పష్టం చేసింది. దేశ వ్యాప్తంగా డీమోనిటైజేషన్ తర్వాత 2016-17 ఆర్థిక సంవత్సరంలో 13.35 లక్షల కోట్లుగా ఉన్న నగదు చెలామణీ.. తాజాగా 2023-24 ఆర్థిక సంవత్సరానికి రూ.35 లక్షల కోట్లకు చేరిందని తెలిపింది.

దేశంలోని ఏటీఎం సెంటర్లలో నగదు నిల్వ చేయడం, వాటి నిర్వహణ, నియంత్రణ మొత్తం ఈ సీఎంఎస్ సంస్థనే చూసుకుంటుంది. గతేడాదితో పోలిస్తే నెలకు సగటున ఏటీఎంల నుంచి విత్డ్రా అయ్యే మొత్తం 5.51 శాతం మేర పెరిగినట్లు తాజా నివేదికలో వెల్లడైంది.

మెట్రో నగరాల్లో ఏటీఎం విత్డ్రాలు 10.37 శాతం పెరిగినట్లు సీఎంఎస్ నివేదిక వెల్లడిస్తోంది. సెమీ అర్బన్, రూరల్ ప్రాంతాల్లో ఈ పెరుగుదల 3.94 శాతంగా ఉందని తెలిపింది. ఏటీఎంల నుంచి నగదు విత్డ్రాల విషయంలో ఢిల్లీ, ఉత్తర్ప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, పశ్చిమబెంగాల్ టాప్లో ఉన్నాయని పేర్కొంది.