
మధ్య భారతం నుంచి ఇండో-గంగా మైదానాల వరకు భానుడి భగభగలకు జనం అల్లాడిపోతున్నారు. డజన్ల కొద్దీ నగరాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటిపోయాయి. పలు ప్రాంతాల్లో పాదరసం 45 డిగ్రీల స్థాయిని కూడా చేరుకుంటోంది. ఎటు చూసినా నిప్పుల కొలిమిని తలపించే వాతావరణమే కనిపిస్తోంది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ, మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో పరిస్థితులు మరింత దారుణంగా మారాయి. ప్రపంచంలోని అత్యంత వేడి నగరాల జాబితాలో ఈ రాష్ట్రాలకు చెందిన ప్రాంతాలే ఎక్కువగా దర్శనమిస్తున్నాయి. కేవలం పెద్ద నగరాలే కాకుండా చిన్న పట్టణాల్లోనూ విపరీతమైన ఎండలు మండిపోతున్నాయి.

తాజా నివేదికల ప్రకారం ఉత్తరప్రదేశ్లోని బింద్కీ, ఫతేపూర్, ఇటావా వంటి ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఏకంగా 46 డిగ్రీలకు చేరుకున్నాయి. పొడి గాలులు నిరంతరాయంగా వస్తుండటం, ఆకాశంలో మబ్బులు లేకపోవడం వల్లే ఈ స్థాయిలో ఎండలు దంచికొడుతున్నాయి. రుతుపవనాల రావడానికి ముందు వాతావరణం అనుకూలించకపోవడం మరో ప్రధాన కారణం.వాతావరణంలో మార్పులు, పచ్చదనం తగ్గిపోవడం వల్లే పగటి పూట ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. అదే సమయంలో రాత్రి వేళల్లో కూడా వేడి ఏమాత్రం తగ్గకపోవడంతో ప్రజలు కంటినిండా నిద్రపోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. దేశవ్యాప్తంగా ఒకేసారి ఇన్ని నగరాల్లో ఈ తరహా వాతావరణం నెలకొనడం ఇదే తొలిసారి అని విశ్లేషకులు చెబుతున్నారు.

ఈ విపరీతమైన వేడి గాలుల కారణంగా చిన్నపిల్లలు, వృద్ధులు, ఆరుబయట పనిచేసే కార్మికులు తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఆస్పత్రుల్లో వడదెబ్బ కేసుల సంఖ్య రోజురోజుకూ విపరీతంగా పెరుగుతోంది. పగటి పూట ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే వణికిపోయే పరిస్థితి దేశమంతటా కనిపిస్తోంది.

అడవుల నరికివేత, కాంక్రీట్ అడవులుగా మారుతున్న నగరాలు, పెరుగుతున్న కాలుష్యం.. వీటన్నింటి ఫలితమే ఈ విపరీతమైన ఉష్ణోగ్రతలు. ఈ తీవ్రత ఇలాగే కొనసాగితే భవిష్యత్లో మరిన్ని కష్టాలు తప్పవని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. స్థానికంగా కురిసే ఉరుములతో కూడిన జల్లులు కొంత ఊరటనిచ్చినా, అది తాత్కాలికమేనని స్పష్టం చేస్తున్నారు.

రాబోయే రోజుల్లోనూ ఈ ఎండల తీవ్రత ఇలాగే కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ వడగాలుల హెచ్చరికలు జారీ చేసింది. అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం వేళల్లో ప్రజలు బయటకు రావొద్దని సూచిస్తోంది. ఒంట్లో నీటి శాతం తగ్గకుండా చూసుకుంటూ, తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఇప్పుడు ప్రతి ఒక్క రికీ అత్యవసరం.