పాన్ ఇండియా ట్రెండ్లో ప్రతీ సినిమా దాదాపు అన్ని భాషల్లో రిలీజ్ అవుతోంది. దీంతో తెలుగు మార్కెట్లోనూ డబ్బింగ్ సినిమాల సందడి కాస్త గట్టిగా కనిపిస్తోంది. ముఖ్యంగా పండుగల సీజన్లోనూ లోకల్ సినిమాల కంటే డబ్బింగ్ సినిమాల జోరే ఎక్కువగా ఉంటోంది. ఈ ఇయర్ దీపావళిని కంప్లీట్గా డబ్బింగ్ సినిమాలే కమ్మేస్తున్నాయి.
తెలుగు సినిమాకు ప్రతీ పండుగ సీజన్ చాలా ఇంపార్టెంట్. అలాంటిది దీపావళి పండుగను పూర్తి డబ్బింగ్ సినిమాలకు వదిలేసేందుకు రెడీ అవుతోంది టాలీవుడ్. దీపావళికి హాట్ ఫేవరెట్గా బరిలో దిగుతున్న మూవీ టైగర్ 3. బాలీవుడ్ స్పై యూనివర్స్ నుంచి వస్తున్న ఈ సినిమా మీద భారీ అంచనాల ఉన్నాయి.
ఇదే సీజన్ను రెండు తమిళ సినిమాలు కూడా టార్గెట్ చేస్తున్నాయి. కార్తి హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ జపాన్. చాలా కాలంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను దీపావళి బరిలో దించేందుకు రెడీ అవుతున్నారు.
క్రాకర్స్ ఫెస్టివల్ను టార్గెట్ చేస్తున్న మరో ఇంట్రస్టింగ్ మూవీ జిగర్తాండ 2. తమిళ్లో సూపర్ హిట్ అయిన జిగర్తాండ సినిమాను తరువాత తెలుగు, హిందీలో రీమేక్ చేశారు. ఇప్పుడు రీమేక్కు ఛాన్స్ ఇవ్వకుండా జిగర్తాండ 2ను అన్ని భాషల్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
ఈ డబ్బింగ్ గోలలో తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు వస్తున్న ఒకే ఒక్క స్ట్రయిట్ మూవీ ఆది కేశవ. వైష్ణవ్ తేజ్, శ్రీలీల జంటగా తెరకెక్కిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ దీపావళి భారిలో టాలీవుడ్ నుంచి పోటికి దిగుతోంది. స్ట్రయిట్ సినిమాగా వస్తున్న ఒకే ఒకే మూవీ కావటం ఆది కేశవకు మరింత ప్లస్ అవుతుందంటున్నారు క్రిటిక్స్.