
ఈ రోజుల్లో స్టార్ హీరోల రెమ్యునరేషన్స్ ఎలా ఉన్నాయనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా వాళ్ల పారితోషికాలు ఆకాశంలో ఉన్నాయి. మొన్నటికి మొన్న తెలంగాణ డిస్ట్రిబ్యూటర్ VI శ్రీధర్ కూడా ఇదే మాట్లాడారు.. డిజాస్టర్ హీరోలకు కూడా పిలిచి మరీ కోట్లు ఇస్తున్నారంటూ ఆయన చేసిన కామెంట్స్ బాగా వైరల్ అయ్యాయి.

హీరోల రెమ్యునరేషన్పై నిర్మాతల వర్షన్ మరోలా ఉంది. ఇక్కడ డిమాండ్ అండ్ సప్లై నడుస్తుందంటున్నారు వాళ్లు. పైగా హీరోలు మాకు దేవుళ్లు.. వాళ్లకు ఎదురు చెప్పే ధైర్యం లేదన్నారు ప్రముఖ నిర్మాత సునీల్ నారంగ్.

కానీ ఇదే విషయంపై మరో నిర్మాత దిల్ రాజు వర్షన్ మాత్రం ఇంకోలా ఉంది. ఆయన మాట్లాడే తీరు మిగిలిన వాళ్లకు పూర్తి భిన్నంగా ఉంది. నితిన్ హీరోగా నటిస్తున్న తమ్ముడు ట్రైలర్ లాంచ్లో దిల్ రాజు మాటలు బాగా వైరల్ అవుతున్నాయి.. రెమ్యునరేషన్ విషయంలో హీరోలకు అర్థమయ్యేలా చెప్తే వాళ్లు వింటారంటున్నారు దిల్ రాజు.

గతంలో బృందావనం అప్పుడు ఎన్టీఆర్.. మిస్టర్ పర్ఫెక్ట్ సమయంలో ప్రభాస్.. వకీల్ సాబ్ టైమ్లో పవన్.. ఇప్పుడు నితిన్.. పారితోషికం విషయంలో పరిస్థితులు అర్థం చేసుకున్నారని చెప్పారు దిల్ రాజు.

లాభ నష్టాలకు అతీతంగా ఉంటున్నారు మన హీరోలు. కానీ ముందు కొంత రెమ్యునరేషన్ తీసుకుని.. సినిమా అయ్యాక మిగిలింది చూసుకుంటే బెటర్ అనేది దిల్ రాజు వాదన. సుకుమార్, త్రివిక్రమ్, రాజమౌళి లాంటి వాళ్లు ఇప్పటికే షేర్ తీసుకుంటున్నారు.. కొందరు హీరోలు ఇదే ఫాలో అవుతున్నారు. అంతా ఇదే చేస్తే ఇండస్ట్రీ కూడా బాగుంటుందంటున్నారు విశ్లేషకులు.