
మనమేంటి.. మనకున్న మార్కెట్ ఏంటి.. బయట ఉన్న ఇమేజ్ ఏంటి.. మనమీద ఎన్ని కోట్ల బిజినెస్ చేయొచ్చు.. ఇలా గ్రౌండ్ రియాలిటీ తెలిసిన హీరోకు ఇండస్ట్రీలో ఎలాంటి ఇబ్బందులుండవు. నాగార్జున కూడా ఇదే దారి ఎంచుకున్నారిప్పుడు. ఒకప్పట్లా తన మార్కెట్ లేదని తెలుసుకున్న నాగ్.. కొత్త ప్లాన్తో ముందుకొస్తున్నారు. మరి అదేంటి..?

35 ఏళ్లుగా నాగార్జున ఆడియన్స్ను అలరిస్తూనే ఉన్నారు. ఇప్పటి వరకు ఆయన చేయని ప్రయోగం లేదు.. కమర్షియల్ ఇమేజ్ పక్కనబెట్టి ఎన్నోసార్లు రిస్కులు తీసుకున్నారు నాగ్. మొన్నటికి మొన్న నా సామిరంగాతోనూ మరోసారి సత్తా చూపించారు కింగ్. ఇదిలా ఉంటే ఈ మధ్య ఎక్కువగా మల్టీస్టారర్స్ వైపు అడుగులేస్తున్నారు ఈ సీనియర్ హీరో.

ఓ ఏజ్ వచ్చిన తర్వాత సీనియర్ హీరోలు తమ వయసుకు గౌరవం ఇవ్వాల్సిందే. అలా కాదని సోలోగా ప్రయోగాలు చేస్తే.. ఫలితాలు దారుణంగా ఉంటాయి. అందుకే నాగార్జున ఎక్కువగా మల్టీస్టారర్స్ వైపు అడుగులేస్తున్నారు. ఊపిరి, దేవదాస్, బంగార్రాజు లాంటి సినిమాల్లో కుర్ర హీరోలతో కలిసి నటించారు. గతేడాది బ్రహ్మస్త్రలోనూ కీలక పాత్రలో కనిపించారు నాగ్.

ధనుష్, శేఖర్ కమ్ముల సినిమాలోనూ కీలక పాత్రలో నటిస్తున్నారు నాగార్జున. ముంబై నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ధారావి అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది.

తాజాగా మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో నాగ్ అత్యంత కీలక పాత్రలో నటించబోతున్నారని తెలుస్తుంది. ఈయనకు జోడీగా దీపిక పదుకొనే పేరు వినిపిస్తుంది. ఏదేమైనా జనరేషన్కు తగ్గట్లు అప్డేట్ అవ్వడంలో నాగార్జున తర్వాతే ఎవరైనా..!