గత కొంతకాలంగా సినీ సెలబ్రిటీల ఇళ్లలో వరుస దొంగతనాలు జరుగుతున్నాయి. రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్, శోభన, సింగర్ విజయ్ ఏసుదాస్ ఇంట చోరీలు జరిగిన సంఘనలు వార్తల్లో వైరల్గా మారాయి. తాజాగా మరో సీనియర్ నటి ఇంట చోరీ జరిగింది.
చెన్నైలోని తన ఇంట్లో బంగారు ఆభరణాలు, ఆస్తులకు సంబంధించిన పత్రాలు చోరీకి గురయ్యాయంటూ సీనియర్ నటి నిరోషా తేనాంపేట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాగా నటి నిరోషా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఘర్షణ మువీతో సినీ కెరీర్ ప్రారంభించిన నిరోషా నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సింధూర పువ్వు సినిమాతో ప్రేక్షకులకు దగ్గరయ్యారు.
తమిళ, తెలుగు, మలయాళ భాషల్లో ఎన్నో సినిమాల్లో నటించిన నిరోషా ప్రస్తుతం చెన్నైలో నివసిస్తున్నారు. సీరియల్స్, సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా ప్రస్తుతం నటిస్తున్నారు. తాజాగా తన ఇంట్లో ఎవరో చోరీకి పాల్పడ్డారని, బంగారాభరణాలోపాటు ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు పోయాయంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కాగా గతమార్చి నెలలో ఐశ్వర్య రజనీకాంత్ ఇంట దొంగతనం కేసు దక్షిణాది హాట్ టాపిక్గా మారింది. ఆ తర్వాత వాళ్ల ఇంట్లో పనిచేసే పనిమనిషి చోరీకి పాల్పడినట్లు వెల్లడైంది. నటి శోభన ఇంట్లో కూడా ఆమె ఇంట్లో పనిమనిషే దొంగతనానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ప్రముఖ సింగర్ విజయ్ ఏసుదాస్ ఇంట జరిగిన చోరీకి సంబంధించిన ఇంకా దర్యాప్తులోనే ఉంది.