
సాయి పల్లవి.. ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. భాషలతో సంబంధమే లేకుండా.. గ్లామర్ షోకు దూరంగా ఉంటూ కేవలం తన సహజ నటనతోనే పాన్ ఇండియా లెవల్లో వరుస సినిమాలతో దూసుకుపోతుంది. సౌత్ టూ నార్త్ విపరతీమైన క్రేజ్ సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ.

తండేల్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సాయి పల్లవి ప్రస్తుతం హిందీలో రామాయణం సినిమాలో నటిస్తుంది. అలాగే ఇప్పుడిప్పుడే హిందీలో వరుస ఆఫర్స్ అందుకుంటుంది. తాజాగా బీటౌన్ టాప్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఛాన్స్ కొట్టేసిందట.

ప్రస్తుతం భారతీయ సినీ చరిత్రలో ధ్రవతారగా వెలిగిన అందాల నటి మధుబాల బయోపిక్ లో సాయి పల్లవి నటించనున్నట్లు సమాచారం. ఈ క్రేజీ ప్రాజెక్టును బాలీవుడ్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తున్నారు. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

అయితే మధుబాల బయోపిక్ కోసం ముందుగా కియారా అద్వానీ, అనీత్ పడ్డా వంటి స్టార్ హీరోయిన్ల పేర్లు పరిశీలనలోకి వచ్చాయట. కానీ మధుబాల పాత్రలో ఉండే గాంభీర్యం, సహజ సిద్ధమైన నటనను పండించాలంటే సాయి పల్లవి కరెక్ట్ అంటున్నారు.

డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ ఇదివరకు ఎన్నో అద్భుతమైన చిత్రాలను తెరకెక్కించారు. పద్మావత్, గంగూబాయి కతియావాడి హిట్ చిత్రాలతో సక్సెస్ అందుకున్నారు. ఇప్పుడు మధుబాల లాంటి ఐకానిక్ పాత్రను సాయిపల్లవితో రూపొందిస్తుండడంతో సినిమా పై మరిన్ని అంచనాలు పెరిగాయి.