
డ్యాన్స్ షోలలో కెరీర్ మొదలు పెట్టి.. ఆ తర్వాత నటిగా తెలుగు, తమిళ, మలయాళ చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుంది ఈ మలయాళీ భామ సాయి పల్లవి. మే 9 ఆమె పుట్టిన రోజు ఈ సందర్భంగా.. కొన్ని విశేషాలు మీకోసం..

సాయి పల్లవి సొంతూరు ఊటీకి దగ్గరలో ఉన్న కోటగిరి గ్రామం. చదువంతా కోయంబత్తూర్లోనే. ఆమె తండ్రి సెందామరై కన్నణ్, కస్టమ్స్ అధికారి. అమ్మ రాధ క్లాసికల్ డ్యాన్సర్. సాయపల్లవి, ఆమె చెల్లెలు పూజా కవల పిల్లలట. తల్లి రాధ చేసే నృత్యం చూస్తూ పెరగడంతో అక్కచెల్లిల్లిద్దరికీ నాట్యంపై డ్యాన్స్పై ఆసక్తి పెరిగింది.

చదువుకుంటున్న రోజుల్లో మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ అంటే సాయి పల్లవికి చాలా భయం. ఆ క్లాస్ నుంచి తప్పించుకోవచ్చనే ఆలోచనతో ఎనిమిదో తరగతి చదువుకుంటున్న సమయంలో ఇంట్లో వాళ్లని ఒప్పించి తొలిసారి ‘ధామ్ ధూమ్’ తమిళం చిత్ర సీమలో కంగనా రనౌత్ పక్కన నటించింది. మరో మువీలో మీరా జాస్మిన్ క్లాస్మేట్గా నటించిన ఈ నేచురల్ బ్యూటీ నటనకు విరామం ఇచ్చి డ్యాన్సు షోలపై దృష్టి పెట్టారు. తమిళంలో స్టార్ విజయ్, తెలుగులో ఈటీవీ నిర్వహిస్తోన్న రియాలిటీ షోల్లో (ఢీ) అవకాశం వచ్చింది. ఆ షోలు చేసేటప్పుడే చాలామంది దర్శకులు హీరోయిన్ ఆఫర్స్ కూడా ఇచ్చారు.

మెడిసిన్ పూర్తైన తర్వాత దర్శకుడు అల్ఫోన్స్ ‘ప్రేమమ్’ (మలయాళం) హీరోయిన్గా చేయమని కోరగా.. స్కిప్టు నచ్చడంతో ఓకే చెప్పేసిందట. ఆ తర్వాత ‘కలి’ మువీలో నటించింది. నటిగా మూడో చిత్రం తెలుగులో ‘ఫిదా’ రూపంలో తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..

గ్లామర్ అనే పదానికి ఒక్కొక్కరూ ఒక్కో అర్థం చెబుతారు. నా దృష్టిలో గ్లామర్ అంటే నేను ఎంపిక చేసుకున్న పాత్ర ప్రేక్షకులకి చేరువవడం. ‘ప్రేమమ్’ సమయంలో ప్రేక్షకులు నన్ను కథానాయికగా స్వీకరిస్తారా, లేదా? అనే భయం ఉండేది. ముఖంపై మొటిమలతో తెరపై ఎలా కనిపిస్తానో అనుకునేదాన్ని. నాకు నేనే నచ్చడం లేదు. అలాంటప్పుడు ప్రేక్షకులు ఎలా స్వీకరిస్తారా? అని మదనపడేదాన్ని. ఆలోచనల్నింటినీ పక్కన పెట్టేసి చివరకు నటించాను. ఒక్కసారిగా నాకు ఫ్యాన్స్ పెరిగిపోయారు. అది నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది.నేను చేసే ప్రతి మువీలో ఒకట్రెండు రోజులు మేకప్ వేసుకోమంటారు. తర్వాత మేకప్ వేస్తే నువ్వు నీలా కనిపించడంలేదంటూ తీసేయమని వాళ్లే చెబుతుంటారు. అందుకే మేకప్కి దూరంగా.. పాత్రకి దగ్గరగా ఉంటానంటూ చెప్పుకొచ్చింది.