ఫ్లాపులొస్తే తట్టుకుని నిలబడటం పెద్ద కష్టమేం కాదు.. కానీ ప్రాణాల మీదకు వచ్చిన తర్వాత తట్టుకుని నిలబడటం.. మళ్లీ హిట్ కొట్టడం అంటే చిన్న విషయం కాదు. కానీ దాన్ని చేసి చూపించారు సాయి ధరమ్ తేజ్. యాక్సిడెంట్ తర్వాత ఈయన కెరీర్లో జోరు మరింత పెరిగింది.
అక్టోబర్ 15న ఈయన బర్త్ డే సందర్భంగా తేజ్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్పై స్పెషల్ స్టోరీ.. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలకు ఎంట్రీ ఈజీగానే ఉంటుంది కానీ అంచనాలు మాత్రం మామూలుగా ఉండవు. సాయి ధరమ్ తేజ్ కూడా అంతే బరువు మోస్తూ ఇండస్ట్రీకి వచ్చారు.
తొలి సినిమా పిల్లా నువ్వులేని జీవితంతో తేజ్ కెరీర్కు పునాది పడింది. రేయ్ ఫ్లాపైనా.. అది కనబడనీకుండా చేసాయి సుబ్రమణ్యం ఫర్ సేల్, సుప్రీమ్ లాంటి విజయాలు. కానీ ఆ తర్వాతే అసలు సినిమా మొదలైంది.
హ్యాట్రిక్తో జోరు మీదున్న సాయి ధరమ్ తేజ్కు ఏకంగా డబుల్ హ్యాట్రిక్ ఫ్లాపులు వచ్చాయి. తిక్క, విన్నర్, నక్షత్రం, జవాన్, ఇంటిలిజెంట్, తేజ్ ఐ లవ్ యు లాంటి సినిమాలు దారుణంగా నిరాశ పరచడమే కాదు.. తేజ్ ఇంక అయిపోయాడన్నారు.. స్టోరీ సెలక్షన్లో వీక్ అంటూ విమర్శలు ఎదుర్కొన్నాడు..
అదే సమయంలో చిత్రలహరి, ప్రతిరోజూ పండగే, సోలో బ్రతుకే సో బెటర్ లాంటి సినిమాలతో కమ్ బ్యాక్ ఇచ్చారు. రిపబ్లిక్ ఫ్లాపైనా.. నటుడిగా తేజ్ను మరో మెట్టు ఎక్కించింది. కానీ 2021 తేజ్ జీవితంలో ఊహించని కుదుపు. యాక్సిడెంట్ నుంచి తృటిలో బయటపడి..
2023లో విరూపాక్షతో బ్లాక్బస్టర్ కమ్ బ్యాక్ ఇచ్చారు. బ్రో సినిమాలో పవన్తో నటించారు. ప్రస్తుతం సంపత్ నందితో గాంజా శంకర్గా రానున్నారీయన. దాంతో పాటు మరో రెండు సినిమాలు లైన్లో ఉన్నాయి. మొత్తానికి పడిలేచిన కెరటం అనే పదానికి నిదర్శనంగా నిలిచారు మెగా మేనల్లుడు.