వర్మ రాజకీయ వ్యూహం ఫలిస్తుందా..? ఎన్నో అవాంతరాలు, చిక్కులు దాటుకుని సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం అనుకున్న సమయానికి విడుదలవుతుందా..? ఏపీలో వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాల దృష్ట్యా వర్మ వ్యూహం ఎలాంటి ప్రభావం చూపించబోతుంది..? ఆ మధ్య రిలీజ్ ఆపండన్న సెన్సార్ బోర్డ్.. ఇప్పుడు క్లీన్ యు సర్టిఫికేట్ ఎలా ఇచ్చింది..?
లేట్గా వచ్చినా లేటెస్టుగా వస్తానంటున్నారు వర్మ. ఈ మధ్య వ్యూహం సినిమాతో ఎక్కువగా సందడి చేస్తున్నారు వర్మ. సాధారణంగా ఈయన సినిమాలను సీరియస్గా తీసుకోవడం ఎప్పుడో మానేసారు ఆడియన్స్. అయితే అప్పుడప్పుడూ రాజకీయ నేపథ్యంలో సినిమాలు ప్రకటిస్తూ.. కాంట్రవర్సీకి తెర తీస్తుంటారు వర్మ. అలాంటి సినిమాలపై వద్దన్నా.. క్యూరియాసిటీ పెరిగిపోతుంది.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం రాజకీయాల్లో జరిగిన కీలక మార్పులు నేపథ్యంలోనే వ్యూహం తెరకెక్కించారు వర్మ. షూటింగ్ ఎప్పుడో పూర్తైనా.. సెన్సార్ సమస్యలతో బయటికి రాలేకపోయింది ఈ చిత్రం. ఈ సినిమాతో వర్మ చెప్పాలనుకున్న పాయింట్ ఏంటో మెయిన్ ట్రైలర్లో చూపించారు. అన్నింటికీ మించి.. ఈ చిత్రం డిసెంబర్ 29న విడుదల కానుంది.
గత ఎన్నికల సమయంలో అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు, పవర్ స్టార్, లక్ష్మీస్ ఎన్టీఆర్ లాంటి సినిమాలు చేసారు వర్మ. ఇప్పుడు అదే చేస్తున్నారు. వ్యూహంతో పాటు దాని సీక్వెల్ శపథం కూడా చేస్తున్నారు.
ఇది జనవరి 25న విడుదల కానుంది. ఇందులో వైఎస్ జగన్ పాత్రలో అజ్మల్ అమీర్.. భారతి పాత్రలో మానసా రాధాకృష్ణన్ నటిస్తున్నారు. మరి వర్మ వ్యూహం ఏపీ రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపించబోతుందో చూడాలి.