
వివాదాస్పద కథలకు ఈ మధ్య గిరాకీ బాగా పెరిగిపోయింది. 20 కోట్ల లోపు బడ్జెట్తో వచ్చిన సినిమాలు కూడా 200 నుంచి 400 కోట్ల వరకు వసూలు చేస్తున్నాయి. అయితే ఇందులో విజయంతో పాటు వివాదం కూడా అంతే ఉంటుంది. అది తెలిసే అడుగులేస్తున్నారు దర్శక నిర్మాతలు. కాశ్మీర్ ఫైల్స్, కేరళ స్టోరీ లాంటి సినిమాలు ఇలా వచ్చి.. సంచలనం సృష్టించనవే.

కాశ్మీర్ ఫైల్స్ విడుదలైనపుడు.. అసలు అలాంటి సినిమా ఒకటి వచ్చిందనే విషయమే ఆడియన్స్కు ఐడియా లేదు. కశ్మీర్ పండిట్స్పై జరిగిన అకృత్యాలే ఈ సినిమా కథాంశంగా తీసుకొచ్చారు వివేక్ అగ్నిహోత్రి.అలాగే కేరళ స్టోరీ కూడా అంతే. చిన్న సినిమాగా వచ్చి 250 కోట్లు వసూలు చేసింది. తాజాగా రాజధాని ఫైల్స్,వ్యూహం లాంటి సినిమాలు కూడా వివాదాలే కేంద్రబిందువుగా వస్తున్నాయి.

తాజాగా నిజాం పాలకుల సమయం నాటి రజాకార్ కథ వస్తుందిప్పుడు. పోస్టర్ విడుదలైనప్పటి నుంచే దీనిపై వివాదం మొదలైంది.. టీజర్ వచ్చాక ఇంకాస్త ముదిరింది.. పాట విడుదలయ్యాక మరో స్థాయికి వెళ్లింది. రాజకీయ నాయకులు కూడా ఈ సినిమాను విడుదల కానివ్వొద్దు.. దీనివల్ల లేనిపోని గొడవలు వస్తాయంటూ స్టేట్మెంట్ ఇస్తున్నారు.

తాజాగా ట్రైలర్తో ఈ వివాదం మరో స్థాయికి వెళ్లేలా కనిపిస్తుంది. ట్రైలర్లో నాటి అరాచకాలను కళ్లకు కట్టినట్లు చూపించారు మేకర్స్. BJP నేత గూడూరు నారాయణ రెడ్డి నిర్మిస్తున్న రజాకార్ సినిమాకు యాటా సత్యనారాయణ దర్శకుడు.

ఫిబ్రవరి 10న హిందీ ట్రైలర్ విడుదల చేసారు. ఫిబ్రవరి 12న తెలుగు ట్రైలర్ విడుదల చేసారు. ఈ సినిమాపై జరుగుతున్న రచ్చ చూస్తుంటే.. కేరళ స్టోరీ, కాశ్మీర్ ఫైల్స్ సీన్ రిపీట్ అయ్యేలాగే కనిపిస్తుంది. మరి చూడాలిక.. ఏం జరగబోతుందో..?