మాస్ సినిమాలు చేసి చేసి.. తనలో ఓ మంచి క్లాస్ హీరో ఉన్నాడనే విషయాన్ని పూర్తిగా మరిచిపోయారు రామ్. ఎనర్జీ మొత్తాన్ని విలన్లను లేపేయడానికే వాడేస్తున్నారు. అందుకే కొన్ని రోజులు కత్తులు, కటార్లు కాకుండా.. పూలు, అమ్మాయిల వైపు చూడాలని ఫిక్సైపోయారు ఈ హీరో. చాన్నాళ్ల తర్వాత అదిరిపోయే ఫ్యామిలీ డ్రామా చేయబోతున్నారు రామ్. మరి దానికి దర్శకుడెవరు..?
రామ్ను మరీ ఇలా మాస్గా చూడ్డం కంటే.. కాస్త క్లాస్గా చూడ్డానికే ఇష్టపడుతుంటారు అభిమానులు. మరీ ముఖ్యంగా లేడీ ఫ్యాన్స్ అయితే రెడీ, నేను శైలజలో ఉన్న రామ్ మాకు కావాలంటున్నారు. అయితే కొన్నేళ్లుగా యాక్షన్ సినిమాలు మాత్రమే చేస్తున్నారు రామ్. 2018లో హలో గురూ ప్రేమకోసమే తర్వాత పూర్తిగా మాస్కే పరిమితమైపోయారు ఎనర్జిటిక్ స్టార్.
ఇస్మార్ట్ శంకర్తో మాస్లో మామూలు ఫాలోయింగ్ రాలేదు రామ్కు. ఈ సినిమా 40 కోట్లకు పైగానే వసూలు చేసింది. ఆ తర్వాత రెడ్ పర్లేదనిపించింది.. కానీ భారీ అంచనాల మధ్య వచ్చిన వారియర్, స్కంద ఫ్లాప్ అయ్యాయి.
ప్రస్తుతం డబుల్ ఇస్మార్ట్తో వస్తున్నారు రామ్. ఇది కూడా పూరీ మార్క్ యాక్షన్ సినిమానే. త్వరలోనే విడుదల కానుంది డబుల్ ఇస్మార్ట్. డబుల్ ఇస్మార్ట్ తర్వాత కొన్నాళ్లు మాస్కి బ్రేక్ ఇవ్వాలని చూస్తున్నారు రామ్.
అందుకే మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి లాంటి క్లాస్ కామెడీ తెరకెక్కించిన మహేష్ దర్శకత్వంలో ఫ్యామిలీ సబ్జెక్ట్కు ఓకే చెప్పినట్లు తెలుస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించే అవకాశం ఉంది. ఏదేమైనా చాలా ఏళ్ళ తర్వాత రామ్లోని లవర్ బాయ్ బయటికి రాబోతున్నాడన్నమాట.