
ఆల్రెడీ థియేటర్లో చూసిన సినిమాను ఓటిటిలో ఎందుకు చూడాలనేది ఆడియన్స్ ప్రశ్న.. అలాంటప్పుడు ఒక్కో సినిమాను వందల కోట్లు పెట్టి ఎందుకు కొనాలనేది ఓటిటి ఓనర్స్ ప్రశ్న.. దీనికిప్పుడు దర్శక నిర్మాతలు ఓ కొత్త ఫార్ములా కనుక్కొంటున్నారు. ఓటిటి మార్కెట్ పెంచుకోడానికి మేకర్స్ ఫాలో అవుతున్న ఆ ఫార్ములా ఏంటో ఎక్స్క్లూజివ్ స్టోరీలో చూద్దాం..

ఒకప్పుడు సినిమాలకు కలెక్షన్లు పెంచుకోడానికి విడుదలైన రెండు మూడు వారాల తర్వాత కొత్త సాంగ్ యాడ్ చేయడమో.. లేదంటే సీన్స్ కలపడమో చేసేవాళ్లు దర్శక నిర్మాతలు గుర్తుందా..? ఇప్పుడు ఓటిటి మార్కెట్ కోసం కూడా ఇలాంటి జిమ్మిక్కులే చేస్తున్నారు మేకర్స్. ఓటిటి కోసం సపరేట్ ఎడిటెడ్ వర్షన్స్ సిద్ధం చేస్తున్నారు.

ఓటిటిని తక్కువగా అంచనా వేయడానికి లేదిప్పుడు. వందల కోట్ల వ్యాపారం అది.. నిర్మాతలకు అదనపు ఆదాయం కూడానూ. మరి అన్ని కోట్లు ఇస్తున్నపుడు సేమ్ సినిమా ఎందుకు ఇవ్వాలి..? ఇదే ఆలోచిస్తున్నారు మేకర్స్ ఇప్పుడు. థియేటర్లో చూసినోళ్లు కూడా ఓటిటిలో ఫ్రెష్ ఫీల్ అవ్వాలని కొత్త మంత్రంతో వస్తున్నారు. వెండితెరపై చూడని బొమ్మను బుల్లితెరపై చూపిస్తున్నారు.

స్టార్ హీరోల సినిమాలకు 50 నుంచి 200 కోట్ల మధ్యలో ఓటిటి రైట్స్ పలుకుతున్నాయి. అందుకే థియేటర్లో చూసిన సినిమా కాకుండా.. ఓటిటి కోసం కొత్త వర్షన్ ఇస్తున్నారు. గతేడాది జవాన్, లియో విషయంలో ఇదే చేసారు మేకర్స్. వాటివల్ల వ్యూవర్ షిప్ పెరిగింది. తాజాగా గోట్ సినిమాకు ఇలాంటి ఎక్స్టెండెడ్ ఓటిటి వర్షన్ ఇవ్వనున్నారు వెంకట్ ప్రభు.

డైరెక్టర్స్ కట్ పేరుతో ఈ ఓటిటి వర్షన్ సిద్ధం చేస్తున్నారు మేకర్స్. యానిమల్, అర్జున్ రెడ్డి సినిమాలకు ఇలాగే డైరెక్టర్స్ కట్ ఇచ్చారు సందీప్ రెడ్డి వంగా. ఈ ఫార్ములా సక్సెస్ అయింది కూడా. ఇక హనుమాన్ ఇంటర్నేషనల్ వర్షన్ ఓటిటి కోసం సిద్ధం చేస్తున్నారు ప్రశాంత్ వర్మ. మరికొన్నిసినిమాలకు ఇదే ఫార్ములా ఫాలో అవుతున్నారు.