
ప్రీతి జింటా బాలీవుడ్ను ఏలిన అలనాటి హీరోయిన్లలో ఒకరు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించారు. తెలుగులోనూ ఒకటీ రెండు సినిమాల్లో నటించారు. వెంకటేశ్, మహేష్ బాబుతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. పెళ్లి తర్వాత నటనకు దూరంగా ఉన్న ప్రీతి.. తాజాగా లాహోర్ 1947 మూవీతో తిరిగి బాలీవుడ్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ వేదిగా తన అభిమానులతో ముచ్చటించారు.

ఈ సందర్భంగా ఓ అభిమాని ప్రీతి పొలిటికల్ ఎంట్రీ గురించి అడిగారు. దానికి ఆమె బదులిస్తూ.. “లేదు! నాకు రాజకీయాలపై ఆసక్తి లేదు. కొన్నేళ్ల క్రితం వివిధ రాజకీయ పార్టీలు నాకు టిక్కెట్లు, రాజ్యసభ సీటు ఆఫర్ చేశాయి, కానీ నేను వాటిని సున్నితంగా తిరస్కరించాను. ఎందుకంటే నాకు రాజకీయాలు తెలియదు.” అని ప్రీతి బదులిచ్చారు.

గతంలో మీరు ఎదుర్కొన్న కొన్ని పరిస్థితులే మిమ్మల్ని రాజకీయాల్లోకి రాకుండా అడ్డుకుంటున్నాయా? అని మరో అభిమాని ప్రశ్నించగా.. ప్రీతి బదులిస్తూ.. “ఇండియాలో సోషల్ మీడియా ఎంత విషపూరితంగా మారిందో కామెంట్స్ను బట్టి అర్థం చేసుకోవచ్చు. నేను రాజకీయ నాయకురాలిని కాదు, రాజకీయాలపై నాకు ఆసక్తి లేదు, కానీ ఒక సాధారణ మహిళగానే ఉంటాను" అని చెప్పుకోచ్చారు.

కాగా ప్రముఖ దర్శకుడు మణిరత్నం డైరెక్షన్లో వచ్చిన దిల్ సే సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యారు ప్రీతి జింటా. ఆ సినిమాలో బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్తో కలిసి నటించారు. తొలి మూవీతోనే ప్రీతి మంచి గుర్తింపు పొందారు. వెంకటేశ్ హీరోగా ప్రేమంటే ఇదేరాతో తెలుగు ప్రేక్షకులను కూడా పలకరించారు.

చాలా గ్యాప్ తర్వాత మళ్లీ తిరిగి వెండితెరపై మెరవబోతున్నారు ప్రీతి జింటా. సన్నీ డియోల్ తో కలిసి లాహోర్ 1947 లో నటించారు. ఈ మూవీని ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తుంది. ఈ సినిమాపై బజ్ బాగానే ఉంది. ఈ సినిమాకు రాజ్ కుమార్ సంతోషి దర్శకత్వం వహిస్తుండగా, ఎఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.