
అభిమానుల అంచనాలకు తగ్గట్టుగా ప్రభాస్ను బిగ్ స్క్రీన్ మీద ప్రజెంట్ చేసిన ప్రశాంత్ నీల్, మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ సినిమాతో డార్లింగ్ ఫ్యాన్స్ ఆకలి తీర్చిన నీల్, సీక్వెల్ను అంతకు మించి ప్లాన్ చేస్తున్నారు. తొలి భాగంలో ఎక్కువగా ప్రభాస్ను సైలెంట్గానే ప్రజెంట్ చేసిన ప్రశాంత్ నీల్ సీక్వెల్లోనే అసలు యాక్షన్ చూపించబోతున్నారు.

సలార్ సీక్వెల్ను 15 నెలల గ్యాప్లో రిలీజ్ చేస్తామని ప్రొడక్షన్ హౌస్ ఎప్పుడో ప్రకటించింది. అందుకు తగ్గట్టుగా జూన్లో షూటింగ్ స్టార్ట్ చేయాలని ఫిక్స్ అయ్యారు దర్శకుడు ప్రశాంత్ నీల్. కానీ ప్రజెంట్ అభిమానుల్లో అంచనాలు భారీగా పెరిగిపోవటంతో మేకింగ్ ప్లాన్ మార్చేశారు.

భారీ చిత్రం కావటంతో ఈ సినిమా షూటింగ్కే కనీసం ఆరేడు నెలల సమయం పడుతుంది. ఆ తరువాత పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా భారీగా ఉంటుంది. అందుకే ఈ ఏడాది ఏప్రిల్లోనే సలార్ పార్ట్ 2 శౌర్యంగ పర్వం షూటింగ్ స్టార్ట్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.

సెట్స్ మీద ఉన్న సినిమాలతో పాటు ప్యారలల్గా సలార్ 2ను పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నారు డార్లింగ్. సలార్ పార్ట్ 1లో ఎక్కువగా ప్రభాస్ ఎలివేషన్, అసలు కథకు లీడ్ చేసే సీన్స్ మీదే దృష్టి పెట్టిన దర్శకుడు, మెయిన్ కథ అంతా పార్ట్ 2లోనే చూపించాల్సి ఉంది.

ప్రాణ స్నేహితులైన దేవా, వరద ఎలా శత్రువులవుతారు? ఖాన్సార్ సింహాసనానికి తానే వారసుడు అని దేవాకు ఇప్పటికే తెలుసా..? ప్రభాస్ తండ్రి పాత్రలో ఎవరు కనిపిస్తారు..? ఇలా ఎన్నో ప్రశ్నలకు సీక్వెల్లో సమాధానాలు ఇవ్వబోతున్నారు. దీనికి కోసం సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.