ఇటీవల కాలంలో సోషల్ మీడియా పుణ్యమా అని బాగా క్రేజ్ తెచ్చుకున్న వారిలో కుమారీ ఆంటీ ఒకరు. హైదరాబాద్లో రోడ్ సైడ్ ఫుడ్ అమ్ముకునే ఆమె అనుకోకుండా స్టార్ సెలబ్రిటీ అయిపోయింది. సాక్షాత్తూ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడడంతో ఆమె పేరు నెట్టింట మార్మోగిపోతోంది.
ఈ క్రేజ్, పాపులారిటీ కారణంగానే కుమారీ ఆంటీ ఫుడ్ బిజినెస్ మరింత రెట్టింపయ్యింది. నగరం నలువైపులా నుంచి ఆమె చేతి వంట రుచి చూసేందుకు జనాలు ఎగబడ్డారు.
ఇక కుమారీ ఆంటీ క్రేజ్ ను క్యాష్ చేసేందుకు పలు యూట్యూబ్ ఛానెళ్లు పోటీ పడ్డాయి. అందుకు తగ్గట్టుగానే పలు టీవీ షోల్లోనూ దర్శనమిచ్చిందామె.
తాజాగా కుమారీ ఆంటీ క్రేజ్ ఏకంగా సినిమాల వరకు పాకేసింది.మలయాళంలో రిలీజై హిట్ టాక్ తెచ్చుకున్న సినిమా 'ప్రేమలు'ను ఇప్పుడు తెలుగులో రిలీజ్ చేస్తున్నారు.
తాజాగా రిలీజైన ప్రేమలు సినిమా ట్రైలర్లో కుమారీ ఆంటీ డైలాగ్ ను వాడేశారు. 'ఈ ఫ్రెండ్ జోన్ అనేది కుమారి ఆంటీ లాంటిదిరా.. పబ్లిసిటీ, పైసలు రెండు ఉంటాయి కానీ ప్రశాంతత ఉండదు' అంటూ కుమారీ ఆంటీని ప్రస్తావించారు.