
సాధారణంగా మన దగ్గర తెలుగు సినిమాల గురించి మాత్రమే చర్చ జరుగుతుంది. కానీ ఈ మధ్యేంటో కొత్తగా మలయాళంలో వచ్చిన రెండు సినిమాల గురించి బాగా చర్చ జరుగుతుంది.. అందులోనూ మెగా హీరోలే వాటిని రీమేక్ చేస్తారు అంటూ ఫ్యాన్స్ కూడా గట్టిగా నమ్ముతున్నారు. మరి అంతగా చర్చకు దారితీస్తున్న ఆ రెండు మలయాళం సినిమాలేంటి..? అందులో విశేషాలేంటి..?

ఈ మధ్య మలయాళం సినిమాలకు మన దగ్గర డిమాండ్ బాగా పెరిగిపోయింది. ఇప్పుడు సంక్రాంతికి విడుదలవుతున్న నా సామిరంగా సైతం 2019లో వచ్చిన పోరింజు మరియం జోస్ అనే మలయాళ సినిమా నుంచి స్పూర్తి పొందిందే అని తెలుస్తుంది. అధికారికంగా చెప్పలేదు కానీ మూలకథను తీసుకుని తెలుగులో నాగార్జున ఇమేజ్కు తగ్గట్లు మార్చి తీసుకొస్తున్నారు.

తాజాగా రెండు మలయాళ సినిమాల గురించి టాలీవుడ్లో చర్చ జరుగుతుంది. ఆ రెండూ మోహన్ లాల్ సినిమాలే కావడం గమనార్హం. ఈ మధ్యే విడుదలైన నేరు అందులో ఒకటి. కళ్ళు లేని ఒక మధ్య తరగతి యువతిని మంత్రి కొడుకు రేప్ చేస్తే.. హీరో ఎలా పోరాడి గెలిపించాడనే పాయింట్ మీద కథ నడుస్తుంది. వకీల్ సాబ్ 2కు బాగా సెట్ అవుతుందని సోషల్ మీడియాలో ప్రచారం జోరందుకుంది.

బయట లొకేషన్స్ ఉండవు.. కేవలం కోర్ట్ డ్రామా మాత్రమే కావడంతో పవన్కు ఈ రీమేక్ సూట్ అవుతుందనే చర్చ మొదలైంది. మరోవైపు లూసీఫర్ 2 షూటింగ్ వేగంగా జరుగుతుంది.

లూసీఫర్ను చిరు గాడ్ ఫాదర్ పేరుతో రీమేక్ చేసారు. మరిప్పుడు పార్ట్ 2ను కూడా ఆయన రీమేక్ చేస్తారా అనే అనుమానాలున్నాయి. మొత్తానికి ఈ రెండు మలయాళ సినిమాలపై టాలీవుడ్లో చర్చ జోరుగా జరుగుతుంది.